జేడీఎస్-కాంగ్రెస్ పొత్తు విధాన సౌధకే పరిమితం, బయటకాదు: మాజీ ప్రధాని దేవేగౌడ, ఝలక్!
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వంలో, కాంగ్రెస్-జేడీఎస్ మైత్రి విషయంలో తాను జోక్యం చేసుకోనని చెప్పిన జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ అప్పుడే సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీఎస్-కాంగ్రెస్ పొత్తు విధాన సౌధకు మాత్రమే పరిమితం అని, బయటకాదని శనివారం మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ బాంబుపేల్చి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఝలక్ ఇచ్చారు.
ఆర్ఆర్ నగర్ ఎన్నికలు
బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్ (ఆర్ఆర్ నగర్ ) శాసన సభ ఎన్నికల ప్రచారంలో శనివారం మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాజీ ప్రధాని దేవేగౌడ మాట్లాడుతూ కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి మాత్రమే పొత్తు పెట్టుకుందని అన్నారు.
కాంగ్రెస్ మా ప్రత్యర్థి
రాజరాజేశ్వరి నగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మా ప్రత్యర్థి అని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు. రాజరాజేశ్వరి నగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మునిరత్న నాయుడును కచ్చితంగా తాము ఓడిస్తామని మాజీ ప్రధాని దేవేగౌడ ధీమా వ్యక్తం చేశారు.
నో చెప్పిన దేవేగౌడ
రాజరాజేశ్వరి నగర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మునిరత్న నాయుడికి జేడీఎస్ పార్టీ అభ్యర్థి రామచంద్రప్ప మద్దతు ఇస్తారని మాజీ మంత్రి డీకే. శివకుమార్ ఇటీవల మీడియాకు చెప్పారు. అయితే రామచంద్రప్పను ఎన్నికల బరిలో నుంచి తప్పించడానికి మాజీ ప్రధాని దేవేగౌడ ససేమిరా అన్నారు.
జయనగర్ ఓకే
రాజరాజేశ్వరి నగర్ లో జేడీఎస్ అభ్యర్థి రామచంద్రప్పకు ఓటు వేసి గెలిపించాలని మాజీ ప్రధాని దేవేగౌడ స్థానిక ప్రజలకు మనవి చేశారు. రాజరాజేశ్వరి నగర్ లో కాంగెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే జయనగర శాసన సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సౌమ్యరెడ్డికి జేడీఎస్ మద్దతు ఇస్తోంది.