బీజేపీ సైలెంట్ ఆపరేషన్: చాలెంజ్ చేస్తున్న కాంగ్రెస్
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ)లో ఎవరు మేయర్ అవుతారో అనే విషయం అంతు చిక్కడం లేదు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ నాయకులు బహిరంగంగా చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. కాంగ్రెస్ కు మేయర్, జేడీఎస్ కు డిప్యూటి మేయర్ పదవులు అని చెప్పుకుంటున్నారు.
అయితే 101 మంది కార్పొరేటర్లు ఉన్న బీజేపీ మాత్రం మౌనంగా ఉంది. మా పార్టీ వారే మేయర్, డిప్యూటి మేయర్ అవుతారని ఆ పార్టీ కార్పొరేటర్లు అంటున్నారు. అయితే ఓటింగ్ కు అవసరమైన 131 మంది బీజేపీలో లేరు.
చివరి నిమిషంలో స్వతంత్ర అభ్యర్థులు బీజేపీకి ఓట్లు వేస్తే మేయర్, డిప్యూటి మేయర్ పదవులు వీరికి దక్కుతాయి. లేదంటే రెండు పదవులతో సహా బీబీఎంపీని కాంగ్రెస్ కు అప్పగించవలసి ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కి చెందిన పలువురు మేయర్ అభ్యర్థి రేసులో ఉన్నారు.
కాంగ్రెస్ నుంచి మంజునాథ రెడ్డి, ఉదయ్ కుమార్, బీజేపీ నుంచి పద్మనాభరెడ్డి, బాలకృష్ణ పోటి చేసే అవకాశం ఉంది. డిప్యూటి మేయర్ రేసులో శాసన సభ్యుడు గోపాలయ్య భార్య హేమలతా, బీజేపీకి చెందిన నాగరత్న రామమూర్తి పోటి చేసే అవకాశం ఉంది.
మేయర్, డిప్యూటి మేయర్ పదవులు రావాలంటే 131 ఓట్లు అవసరం. కార్పొరేటర్లతో పాటు ఎంపీలు, శాసన సభ్యులు, ఎంఎల్ సీలతో కలిపి బీజేపికి 128 ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్, జేడీఎస్, స్వతంత్ర అభ్యర్థులు కలుపుకుంటే 132 ఓట్లు ఉన్నాయి.
చివరి నిమిషంలో స్వతంత్ర అభ్యర్థులు బీజేపీకి మద్దతు ఇస్తే కాంగ్రెస్, జేడీఎస్ కు సినిమా కనపడుతుంది. జేడీఎస్ నాయకులు ఇప్పటికే పలు డిమాండ్లు తెరమీదకు తీసుకు వచ్చారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు బద్దశత్రువు అయిన మాజీ ప్రధాని దేవేగౌడ చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు.