నష్టాల నుంచి గట్టెక్కేందుకు: ఈ దేశాలకు జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు రద్దు
నష్టాల ఊబిలో కూరుకుపోతున్న ప్రముఖ విమానాయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ తాజాగా పలు అంతర్జాతీయ సర్వీసులకు బ్రేక్ వేయనుంది. దీంతో పాటు ఏ రూట్లలో అయితే ప్రయాణికులు అధికంగా ప్రయాణిస్తారో ఆ రూట్లలోనే విమానాలను నడిపేందుకు చర్యలు తీసుకుంటోంది. అయితే తన ఆపరేషన్స్ మాత్రం నిలిపేది లేదని అవి యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇప్పటికే 9 గల్ఫ్ దేశాలకు 30 సర్వీసులను నిలిపివేస్తున్నట్లు జెట్ ఎయిర్ వేస్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అదే సమయంలో 20 అదనపు సర్వీసులను ప్రపంచ వ్యాప్తంగా నడుపుతోంది. ముఖ్యంగా ఆగ్నేయాసియా రూట్లలో నడిపేందుకు సుముఖంగా ఉన్నట్లు అధికారి వెల్లడించారు. జెట్ ఎయిర్ వేస్ సంస్థ రోజుకు 600 విమానాలను భారత్తో పాటు ఇతర దేశాల్లో నడుపుతోంది.
ప్రస్తుతం జెట్ ఎయిర్ వేస్ విమానం మస్కట్, దోహా, అబుదాబి, దుబాయ్లాంటి దేశాలకు సర్వీసులను కట్ చేస్తూ అదే సమయంలో సింగపూర్, ఖాట్మాండు, బ్యాంకాక్, దేశాలకు అదనపు సర్వీసులను నడిపేందుకు యోచిస్తోందని సంస్థకు చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. ఏవియేషన్ ఇండస్ట్రీ నియమనిబంధనలు, పెరిగిపోతున్న ఇంధన ధరలు, పడిపోతున్న రూపాయి విలువలతో జెట్ ఎయిర్ వేస్ సంస్థ పలు నిర్ణయాలు తీసుకుందని ప్రతినిధి తెలిపారు. సంస్థను ఆర్థికంగా నిలబెట్టేందుకు తప్పని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.
జెట్ ఎయిర్వేస్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆర్థికంగా ఎలాంటి లాభాలు చేకూర్చని రూట్లలో విమానాలను నడపడం ఆపి లాభాలు తీసుకొచ్చే రూట్లలో నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రతినిధి తెలిపారు. ఈ వ్యూహంలో భాగంగానే గల్ఫ్ దేశాలకు సర్వీసులు తగ్గించి ఢిల్లీ,ముంబైలాంటి హబ్లపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఇక డిసెంబర్ 1 నుంచి పూణే నుంచి సింగపూర్కు డైరెక్టు విమానం నడపనుండగా... ఇక ఢిల్లీ-బ్యాంకాక్ రూట్లలో సర్వీసులను పెంచుతామని చెప్పారు. ముంబై-దోహా, ఢిల్లీ-దోహా, ఢిల్లీ-సింగపూర్, ముంబై-సింగపూర్, ముంబై-దుబాయ్, ఢిల్లీ-ఖాట్మాండులకు సర్వీసులను నడుపుతామని యాజమాన్యం పేర్కొంది. గతేడాది ఎతిహాద్ ఎయిర్వేస్తో జత కట్టిన జెట్ ఎయిర్ వేస్ భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు అత్యధిక సంఖ్యలో ప్రయాణికులను చేరవేసింది. అయితే ఒక్క జెట్ ఎయిర్ వేస్గా చూస్తే దీని ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్ సంస్థలో ఎతిహాద్ వాటా 24శాతంగా ఉంది.