మంత్రి సోదరి ఇల్లు లూటీ చేసిన దుండగులు
బెంగళూరు: మంత్రి సోదరి ఇంటిలో చోరబడిన దుండగులు భీభత్సం చేసి ఇల్లు లూటీ చేసిన సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. పోలీసు అధికారులు సంఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటకలో జనవనరుల శాఖా మంత్రిగా ఎం.బీ. పాటిల్ ఉన్నారు.
ఈయన సోదరి కల్పనా పాటిల్ విజయనగరలోని శాంతినికేతన్ లేఔట్ లో నివాసం ఉంటున్నారు. గురువారం వేకువ జామున కల్పనా పాటిల్ తో పాటు నలుగురు గాఢనిద్రలో ఉన్నారు. అదే సమయంలో 15 మంది దుండగులు వీరి ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు.
తరువాత కల్పనా పాటిల్ తోపాటు అందరిని తాళ్లతో కట్టివేశారు. ఇల్లు మొత్తం గాలించి బంగారు, వజ్రాల నగలతో పాటు నగదు లూటీ చేసి అక్కడి నుంచి పరారైనారు. తరువాత అతి కష్టం మీద చేతికట్లు విప్పుకున్న కల్పనా పాటిల్ కుటుంబ సభ్యులు సోదరుడు ఎం.బీ. పాటిల్ కు సమాచారం ఇచ్చారు.
తరువాత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. 300 గ్రాముల బంగారు నగలు, రూ. 8 లక్షల విలువైన వజ్రం, 15 లక్షల రూపాయల నగదుల లూటీ అయ్యిందని కల్పనా పాటిల్ ఫిర్యాదు చేశారని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.