జార్ఖండ్ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న జేవీఎం..
జార్ఖండ్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ సంకీర్ణ సర్కార్ అధికారంలోకి వచ్చాక బేషరతుగా మద్దతు ప్రకటించి కూటమిలో భాగమైన జార్ఖండ్ వికాస్ మోర్చా(జేవీఎం-పీ).. తాజాగా మద్దతును ఉపసంహరించుకుని,కూటమి నుంచి బయటకొచ్చేసింది. కాంగ్రెస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను లాగేసుకోవాలని చూస్తున్నందువల్లే ప్రభుత్వం నుంచి బయటకు వెళ్తున్నట్టు ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్కు రాసిన లేఖలో జేవీఎం అధ్యక్షుడు బాబులాల్ మరాండీ పేర్కొన్నారు. జేవీఎంను విచ్చిన్నం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని లేఖలో ఆరోపించారు.
'డిసెంబర్ 24,2019న హేమంత్ సొరెన్ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ప్రకటించాం.కానీ ప్రభుత్వంలో భాగమైన కాంగ్రెస్ మా పార్టీ ఎమ్మెల్యేలనే లాగేసుకోవాలని చూస్తోంది. దీనిపై వార్తా పత్రికలు కూడా కథనాలు ప్రచురించాయి. ఈ నేపథ్యంలోనే సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతుపై పున:సమీక్షించుకున్నాం. పార్టీ నేతలతో చర్చించాక మద్దతును ఉపసంహరించుకునేందుకు నిర్ణయించుకున్నాం.' అని బాబులాల్ మరాండీ లేఖలో పేర్కొన్నారు.
జేవీఎం ఎమ్మెల్యేలు ప్రదీప్ యాదవ్,మందు తిర్కే ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసిన మరుసటిరోజే ఈ ప్రకటన రావడం గమనార్హం. సోనియాతో పాటు రాహుల్ గాంధీ,జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్చార్జి ఆర్పీఎన్ సింగ్ను కూడా వీరు కలిశారు. దీంతో జేవీఎం అధినేత తమ పార్టీ నేతలను కాంగ్రెస్ లాగేసుకుంటోందని ఆరోపిస్తూ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. కాగా,జేవీఎం మద్దతు ఉపసంహరణతో కూటమి ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదు. 81 మంది సభ్యులున్న అసెంబ్లీలో జేవీఎం మద్దతు లేకుండానే సంకీర్ణ ప్రభుత్వానికి 47 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కాబట్టి జేవీఎం మద్దతు ఉపసంహరణ ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం చూపించదు.