Jharkhand Judge Murder :సంచలనం రేపుతున్న జార్ఖండ్ జడ్జి హత్య-ఆ గ్యాంగ్స్టర్స్ పనేనా-సీబీఐ విచారణకు డిమాండ్
జార్ఖండ్ జడ్జి 'ఉత్తమ్ ఆనంద్' హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మొదట ఆయనది అనుమానాస్పద మృతిగా,ఆపై రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాక అసలు నిజం బయటపడింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ టెంపో వాహనంలో ఉద్దేశపూర్వకంగానే ఆయన్ను ఢీకొట్టి హత్య చేసినట్లుగా తేలింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ హత్యతో దేశంలో న్యాయ వ్యవస్థ ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని సుప్రీం కోర్టు బార్ అసోసిసేషన్(ఎస్సీబీఏ) చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు విజ్ఞప్తి చేసింది.

అసలేం జరిగింది....
జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లా కోర్టులో ఉత్తమ్ ఆనంద్ జడ్జిగా కొనసాగుతున్నారు. బుధవారం(జులై 28) మార్నింగ్ వాక్కి వెళ్లిన ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తన ఇంటికి అర కిలో మీటర్ దూరంలో రోడ్డు పక్కన ఆయన పడిపోయి కనిపించారు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి రక్తమోడుతున్న ఉత్తమ్ ఆనంద్ను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు. ఆ తర్వాత కొద్ది గంటల పాటు ఆయన మృతదేహం ఆస్పత్రిలోనే ఉంది. అప్పటివరకూ ఆయన జడ్జి అనే విషయాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు.

పోలీసులు రంగంలోకి దిగడంతో...
మార్నింగ్ వాక్కి వెళ్లిన ఉత్తమ్ ఆనంద్... తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అనుమానాస్పద స్థితిలో మరణించిన ఒకరి మృతదేహం స్థానిక ఆస్పత్రిలో ఉన్నట్లు తెలుసుకున్నారు. అక్కడికి వెళ్లి పరిశీలించగా ఆ మృతదేహం ఉత్తమ్ ఆనంద్దే అని నిర్దారించారు. రోడ్డు ప్రమాదంలో మరణించి ఉంటాడేమోనన్న అనుమానంతో పట్టణంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. దీంతో ఉత్తమ్ ఆనంద్ అనుమానాస్పద మృతి కాస్త హత్యగా తేలింది.
సీసీటీవీ ఫుటేజీలో బయటపడింది..
సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే... జడ్జి ఉత్తమ్ ఆనంద్ రోడ్డుకు ఒక పక్కగా జాగింగ్ చేస్తూ వెళ్తున్నారు. ఇంతలో వెనుక వైపు నుంచి వచ్చిన ఓ టెంపో వాహనం... ఉద్దేశపూర్వకంగానే ఆయన్ను ఢీకొట్టి వెళ్లింది. అప్పటిదాకా రోడ్డు మధ్యలో వెళ్తున్న టెంపోను ఆ డ్రైవర్... కావాలనే ఎడమ వైపుకు తిప్పి ఉత్తమ్ ఆనంద్ను ఢీకొట్టాడు. దీంతో గాయాలపాలైన ఉత్తమ్ ఆనంద్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనను సుమోటో కేసుగా పరిగణించి అత్యవసర విచారణ జరపాలని ఎస్సీబీఏ సుప్రీం కోర్టును కోరింది. ఇది న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణించింది.

సీబీఐ విచారణ కోరిన ఎస్సీబీఏ...
మొదట జస్టిస్ చంద్రచూడ్ నేత్రుత్వంలోని బెంచ్కు దీనిపై అప్పీల్ చేసిన ఎస్సీబీఏ ఆ తర్వాత చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేత్రుత్వంలోని బెంచ్కు అప్పీల్ చేసింది. దీనిపై సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని పేర్కొంది. సీజేఐ ఎన్వీ రమణ స్పందిస్తూ... ఘటనపై జార్ఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్తో మాట్లాడినట్లు చెప్పారు. దీనిపై ఆయన దృష్టి సారించారని... ఆయన చూసుకుంటారని చెప్పారు. జార్ఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ... ప్రస్తుతం దీనిపై పోలీసుల విచారణ జరుగుతోందని... ఒకవేళ ఆ విచారణ సంతృప్తికరంగా లేకపోతే కేసును సీబీఐకి బదిలీ చేస్తామని చెప్పారు.

ఆ గ్యాంగ్స్టర్స్ పనేనా...?
హత్యకు గురైన ధన్బాద్ కోర్టు జడ్జి ఉత్తమ్ ఆనంద్ ప్రస్తుతం చాలా మాఫియా కేసులపై విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఓ కేసులో ఇద్దరు గ్యాంగ్స్టర్స్కు బెయిల్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆ గ్యాంగ్స్టర్సే ఉత్తమ్ ఆనంద్ను హత్య చేసి ఉంటారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తమ్ ఆనంద్ను ఢీకొట్టిన ఆటో డ్రైవర్ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ముగ్గురిని విచారిస్తున్న పోలీసులు వారి నుంచి వివరాలు రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు.












Click it and Unblock the Notifications