అసెంబ్లీ రద్దుకు మాంఝీ ప్రతిపాదన: క్యాబినెట్ భేటీ రసాభాస
పాట్నా: బీహార్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శనివారంనాడు వేగంగా మలుపు తిరిగాయి. బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంఝీ శాసనసభ రద్దుకు మంత్రి వర్గ సమావేశంలో ప్రతిపాదన పెట్టారు. దాంతో మంత్రివర్గ సమావేశం రసాభాసగా మారింది. ఆయన గవర్నర్ కేశరీ నాథ్ త్రిపాఠీకి సిఫార్సు చేసినట్లు కూడా జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. మంత్రివర్గ సమావేశంలో శాసనసభ రద్దుకు మాంఝీ ప్రతిపాదన చేశారు. అయితే, మెజారిటీ మంత్రులు ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తిరుగుబాటు ప్రకటించారు.
ప్రతిపాదనకు ఏడుగురు మంత్రుల మద్దతు మాత్రమే లభించింది. మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మద్దతుదారులు 21 మంది మంత్రులు వ్యతిరేకించారు. అయినా, ఆయన శాసనసభ రద్దకు సిఫార్సు చేశారు. అదే సమయంలో ఆయన ల్లలాన్ సింగ్, పికె షాహీ అనే ఇద్దరు మంత్రులను డిస్మిస్ చేశారు. దీన్ని గవర్నర్ అంగీకరించారు.
వారిద్దరు నితీష్ కుమార్కు మద్దతు తెలపడమే కాకుండా మంఝీని తొలగించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని జెడి(యు) నాయకత్వం చేసిన సూచనను మంఝీ తిరస్కరిస్తూ వచ్చారు. మంఝీని తొలగించి, నితీష్ కుమార్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని అనుకున్న నేపథ్యంలో బీహార్లో సంక్షోభం చోటు చేసుకుంది. మంఝీ బిజెపి సూచన మేరకు పనిచేస్తున్నారని జెడియు విమర్శించింది.
నితీష్ కుమార్ సాయంత్రం నాలుగు గంటలకు ఏర్పాటు చేసిన శాసనసభ్యుల సమావేశానికి మంఝీ మద్దతుదారులు గైర్హాజరయ్యారు. శనివారం ఉదయం మంఝీ నితీష్ కుమార్ నివాసానికి వెళ్లి ఆయనను కలుసుకున్నారు. పార్టీని చీల్చవద్దని ఆయన కోరారు. మంఝీ దిగిపోవాల్సిందేనని, ఆ స్థానంలో తిరిగి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కావాల్సిందేనని జెడియు నాయకత్వం స్పష్టం చేసింది. ఐ విషయాన్ని జెడియు సీనియర్ నేత కెసి త్యాగి చెప్పారు.
మంఝీకి డజను మందికి పైగా శాసనసభ్యులు మద్దతు ఇస్తున్నారని, కాగా బిజెపి బహిరంగంగా ఆయనకు మద్దతు ప్రకటించింది. 243 మంది శాసనసభ బలం కాగా, జెడియుకు 115 మంది శాసనసభ్యులున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్కు చెందిన 24 మంది శాసనశభ్యులు మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెసుకు చెందిన ఐదుగురు శాసనసభ్యులు, కమ్యూనిస్టు పార్టీ నుంచి ఒకరు, ఇద్దరు స్వతంత్రులు కూడా జెడియు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు.