'జెఎన్యు' వెనుక టెర్రరిస్ట్ హఫీజ్ మద్దతు: రాజ్నాథ్
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్యు)లో ఆందోళనల వెనుక పాకిస్తాన్ లష్కరే తోయిబా ఉగ్రవాది హఫీజ్ సయీద్ హస్తం ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం నాడు మండిపడ్డారు. హఫీజ్ సయీద్ లష్కరే తోయిబా చీఫ్.
పార్లమెంటుపై దాడి కేసులో దోషి అయిన అఫ్జల్ గురుకు అనుకూలంగా జెఎన్యులో ఒక ప్రత్యేక దినం నిర్వహించిన వ్యవహారం రోజురోజుకు ముదురుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు.
భారత జాతికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాకిస్థాన్ ఉగ్రవాది, లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ హస్తం ఉందన్నారు. భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న అంశంపై మాట్లాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ విషయమై అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. జెఎన్యు ఘటనలో అసలు దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు.
'జెఎన్యూకి జాతి వ్యతిరేక ముద్ర వేయకండి'
జెఎన్యులో తలెత్తిన వివాదం, చోటు చేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చకు తావిచ్చిన నేపథ్యంలో కేవలం తాజా పరిణామాల్ని దృష్టిలో పెట్టుకుని విశ్వవిద్యాలయానికి జాతి వ్యతిరేక ముద్ర వేయరాదని అక్కడి అధ్యాపకులు విజ్ఞప్తి చేశారు.
ఇటీవల విశ్వవిద్యాలయంలో జరిగిన పరిణామాలు అంతర్గతంగా చోటు చేసుకున్నవని, ఇలాంటి ఘటన వల్ల మొత్తం వర్సిటీపై దేశవ్యతిరేక ముద్ర వేయడం సబబు కాదన్నారు.
ఏళ్ల తరబడి ఇక్కడ మేం విద్యా బోధన చేస్తున్నామని, జెఎన్యు అంటే ఏమిటో తమకు తెలుసునని, మేము ప్రజలను కోరేది ఒక్కటేనని, తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని మొత్తంగా విశ్వవిద్యాలయం ప్రతిష్ఠను దెబ్బతీయవద్దన్నారు. ఒకవేళ విద్యార్థులు తప్పు చేసినా అది క్రమశిక్షణారాహిత్యంగా చూడాలి తప్ప దేశద్రోహం కాదని వారు కోరారు.