జేఎన్యూ హింసాకాండ : మూక దాడిపై ప్రత్యక్షసాక్షులు ఏమంటున్నారు..
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU)లో ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న హింసాకాండపై ఏబీవీపీ,వామపక్ష విద్యార్థి సంఘాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. పోలీసులు ఏబీవీపీ విద్యార్థులకు సహకరించి క్యాంపస్ లోపలికి పంపించారని, హింసాకాండ తర్వాత వారంతా జేఎన్యూ గేట్ వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేసినా పోలీసులు పట్టించుకోలేదని వామపక్ష విద్యార్థులు,పలువురు రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘటనపై పలువురు ప్రత్యక్ష సాక్షులు పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు..:
ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. ముసుగులు ధరించి చేతిలో ఆయుధాలతో క్యాంపస్ లోపలికి ప్రవేశించిన మూక మొదట పెరియార్ హాస్టల్ వద్దకు చేరుకున్నారు. సూరి కృష్ణన్ అనే ఎస్ఎఫ్ఐ కార్యకర్తపై మొదట వారు దాడికి పాల్పడ్డారు. 'ముసుగులు ధరించి వచ్చిన ఓ పెద్ద మూక హిందీలో మమ్మల్ని దూషించారు. అందుకు నేను కూడా ధీటుగా బదులివ్వడంతో ఐరన్ రాడ్తో తలపై కొట్టారు. తలపై రెండు కుట్లు పడ్డాయి,చేతులకూ గాయాలయ్యాయి.'అని ఎయిమ్స్కు తరలించిన ఎంఏ విద్యార్థి సూరికృష్ణన్ తెలిపారు.

జేఎన్యూ టీచర్లపై దాడి :
ముఖానికి ముసుగులు,చేతిలో కర్రలతో దాదాపు వంద మంది మూక తమవైపు దూసుకురావడంతో జేఎన్యూ టీచర్లు ఆందోళన చెందారు. వారి వద్దకు వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఆ మూక వారిపై దాడికి పాల్పడింది. తలలు పగిలేంతా పెద్ద పెద్ద రాళ్లను తమవైపు విసిరినట్టు చెప్పారు.
Recommended Video

ప్రేక్షక పాత్రలో పోలీసులు..? :
ఆ మూక రాళ్ల దాడికి పాల్పడటంతో తన తల,వీపు భాగంలో గాయాలైనట్టు జేఎన్యూ ప్రొఫెసర్ శుక్లా సావంత్ తెలిపారు. పెద్ద పెద్ద రాళ్లను తమవైపు విసిరినట్టుగా చెప్పారు. ఇదంతా జరుగుతున్నప్పుడు పోలీసులు జేఎన్యూ గేట్ వద్దే ఉన్నారని.. అయినా ఒక్క పోలీస్ కూడా ఆ మూకను అడ్డుకోలేదని తెలిపారు. ఆ తర్వాత రెండు గంటల పాటు ప్రతీ హాస్టల్కు వెళ్లి వారు దాడికి పాల్పడినట్టు ఆరోపించారు.

బిక్కుబిక్కుమంటూ దాక్కున్న విద్యార్థినులు :
రాత్రి 9.45గం. సమయంలో జేఎన్యూ విద్యార్థి ఒకరు తమకు ఫోన్ కాల్ చేసినట్టు ది ఇండియన్ ఎక్స్ప్రెస్ వెల్లడించింది. మూక దాడి నుంచి తప్పించుకునేందుకు కొంతమంది అమ్మాయిలు సబర్మతీ హాస్టల్లోని వుమెన్ వింగ్ వైపు పరిగెత్తినట్టు తెలిపింది. ఆపై దాదాపు మూడు గంటలుగా గదికి తాళం వేసుకుని అందులోనే బిక్కుబిక్కుమంటూ గడిపినట్టు పేర్కొంది. వారిలో కొందరికీ తలకు గాయాలైనట్టు వెల్లడించింది.












Click it and Unblock the Notifications