కరోనాతో మరణిస్తే ఫ్యామిలీలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ. 10 లక్షలు: మమతా బెనర్జీ
కోల్కతా: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగ కల్పిస్తామని ప్రకటించారు.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 12 మంది ప్రభుత్వ ఉద్యోగులు కరోనాతో మరణించారని సీఎం మమతా తెలిపారు. అంతేగాక, కరోనా పోరులో ముందు నడుస్తున్న వైద్యులు, పోలీసులు, ఆరోగ్య కార్యకర్తలు ఎవరైనా కరోనా బారిన పడి మరణిస్తే 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని తెలిపారు.

ఇక ప్రైవేటు రంగంలోని వారికి కూడా ఇదే విధమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కరోనాకు భయపడవద్దని సరైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు.
రాబోయే కాలంలో టెస్టింగ్ సామర్థ్యాన్ని మరింతగా పెంచుతామని మమతా బెనర్జీ తెలిపారు. కాగా, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు మరింతగా పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 34,427 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12,747 యాక్టివ్ కేసులున్నాయి. 20,680 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 1,000 మంది మరణించారు.












Click it and Unblock the Notifications