కేరళలో బీజేపీకి షాక్ ... జైలుపాలైన పార్టీ అభ్యర్థి
తిరువనంతపురం : ఆయన కేరళ బీజేపీ నేత. కోజికోడ్ నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలో దిగాడు. ప్రచారం కూడా మొదలుపెట్టాడు. ఇంతలో ఊహించని షాక్ తగిలింది. మహిళపై దాడి కేసులో కోర్టు ఆయనను జైలుకు పంపింది. పార్టీ అభ్యర్థి జైలుపాలవడంతో బీజేపీకి దిక్కుతోచని స్థితిలో పడింది.
మహిళపై బీజేపీ నేత దాడి
ఎన్నికల వేళ జైలుపాలైన ఆ నేత పేరు ప్రకాశ్ బాబు. కోజికోడ్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి. ఏప్రిల్ 23న ఎన్నిక జరగనుండటంతో ప్రకాశ్ బాబు క్యాంపెయినింగ్లో బిజీగా అయ్యాడు. అయితే పోలింగ్ కు 25 రోజుల ముందు ఆయనకు కోర్టు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. గతేడాది నవంబర్లో శబరిమలలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న ప్రకాశ్ బాబు ఆలయంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసిన ఓ మహిళపై దాడి చేశాడు. దీనిపై సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు ఫైల్ చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు.
బెయిల్ నిరాకరించిన కోర్టు
మహిళా భక్తురాలిపై దాడి ఘటనపై విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రకాశ్ బాబుకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో పోలీసులు ఆయనను కొట్టరక్కర సబ్ జైలుకు పంపారు.
ఎన్నికలకు ముందే గెలుపు బోణీ కొట్టిన బీజేపీ..! ఎలా అంటారా?
దిక్కుతోచని స్థితిలో బీజేపీ
పార్టీ అభ్యర్థి జైలు పాలవడంతో కేరళ బీజేపీ దిక్కుతోచని స్థితిలో పడింది. కోర్టు తీర్పుపై పై కోర్టులో అప్పీల్ చేయాలని నిర్ణయించింది. ఇదిలా ఉంటే మహిళపై దాడితో పాటు మరో ఏడు కేసుల్లో నిందితుడైన ప్రకాశ్ బాబు ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా.. కేరళ హైకోర్టు కొట్టివేసింది.