జర్నలిస్టు రాణా ఆయూబ్కు చుక్కెదురు.. లండన్ వెళ్లే సమయంలో నిలిపివేత..
మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జర్నలిస్ట్ రాణా ఆయూబ్కు చుక్కెదురైంది. ఇవాళ ఆమె ముంబై ఎయిర్ పోర్టు నుంచి లండన్ వెళ్లేందుకు సిద్దమయ్యారు. అయితే బోర్డింగ్ అయ్యే సమయంలో పోలీసులు ఆపివేశారు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెను లండన్ వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఈ మేరకు ఆమె స్వయంగా ట్వీట్ చేశారు.
తాను జర్నలిస్టుల కోసం జరిగే సమావేశంలో ప్రసంగించడానికి వెళుతున్నానని చెప్పారు. కానీ పోలీసులు తనను ఆపివేశారని తెలిపారు. తర్వాత ఇటలీ కూడా వెళ్లాల్సి ఉందని గుర్తుచేశారు. భారత ప్రజాస్వామ్యంపై జర్నలిస్టం ఫెస్టివల్ అనే అంశంపై మాట్లాడాల్సి ఉండేదని చెప్పారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. తన పర్యటన గురించి డాక్టర్ జులీ పొసెట్టి ప్రిపేర్ చేశారని తెలిపారు. విదేశీ టూర్, జర్నలిజం ఫెస్టివల్ గురించి వారే ప్రణాళిక రూపొందించారని చెప్పారు. అలా వెళ్లగా.. ఈడీ నుంచి మెయిల్ వచ్చిందని.. వారు వెంటనే నిలపివేశారని తెలిపారు.
1.77 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని, ఆ డబ్బును సొంత అవసరాల కోసం వాడుకున్నారని రాణా ఆయూబ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎవరినీ మోసం చేయలేదని, కొంత మంది కుట్రపూరితంగా తనపై తప్పుడు కేసులు పెట్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు. కొవిడ్-19 తర్వాత పరిస్థితుల్లో నిరుపేదలకు సాయం చేయడానికి కెట్టో వేదికగా నిధులు సేకరించిన మాట వాస్తవమే అయినప్పటికీ, దాంట్లో డబ్బులేమీ దుర్వినియోగం చేయలేదని, ప్రతి రూపాయికి సంబంధించిన లెక్కలు రాసి ఉన్నాయని రాణా అయూబ్ అన్నారు.