మహిళా జర్నలిస్టుపై హంతకుడి దాడి
అహ్మదాబాద్: ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు, సామాజికవేత్త రేవతిలాల్ పై కరుడుకట్టిన నేరస్తుడు, హంతకుడు దాడి చేసి ఇష్టం వచ్చినట్లు పిడిగుద్దులు కురిపించాడు. ఇంటర్వూ చెయ్యడానికి వెళ్లిన సమయంలో తన మీద దాడి జరిగిందని రేవతిలాల్ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నరోడా-పాటియా హింసాకాండ ఉదంతంపై పుస్తకం రాస్తున్న రేవతిలాల్ కరుడుకట్టిన నేరస్తుడు, హంతకుడు సురేష్ ఛరాను కలిసిన సమయంలో అతను దాడి చేశాడని పోలీసు అధికారులు అన్నారు.
నరోడా-పాటియా నరమేధం కేసులో సురేష్ ఛరా కు 31 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. జైలు శిక్ష అనుభవిస్తున్న సురేష్ ఛరా కుమార్తె ఇటీవల అదృశ్యం అయ్యింది. కుమార్తె ఆచూకి తెలుసుకోవడానికి గత వారంలో సురేష్ ఛరా పెరోల్ మీద విడుదలయ్యాడు.
విషయం తెలుసుకున్న రేవతిలాల్ ఈ కేసులో కీలకమైన సురేష్ ఛరాను ఇంటర్వూ చెయ్యడానికి ప్రయత్నించారు. అతడిని కలిసి ఇంటర్వూ చేస్తున్న సమయంలో ఆమెపై దాడి చేశాడు. పిడిగుద్దులు కురిపించాడు.
ఆమెపై అమానుషంగా ప్రవర్తించాడు. ముఖం మీద ఉమ్మివేసి నీచంగా ప్రవర్తించాడని రేవతిలాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరికి సురేష్ ఛరా కుమారుడు, బంధువుల సహాయంతో అక్కడి నుంచి తప్పించుకున్నానని రేవతిలాల్ అంటున్నారు.
2002 ఫిబ్రవరి 28వ తేది అహమ్మదాబాద్ శివార్లలోని నరోడా-పాటియాలో అల్లరిమూకలు మహిళలపై సామూహిక అత్యాచారాలకు తెగబడి నరమేధం సృష్టించారు. మతోన్మాద హింస చేలరేగింది. ఈ హింసాకాండలో 97 మంది మరణించారు.
ఈ కేసులో ప్రధాన దోషిగా తేలిన సురేష్ ఛరాకు న్యాయస్థానం 31 ఏళ్ల కఠినకారాగార శిక్ష విధించింది. ఈ అల్లర్లలో మరణించిన వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. తన భర్త నుంచి ప్రాణహాని ఉందని 2015 డిసెంబర్ లో సురేష్ ఛరా భార్య అహమ్మదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.