బీజేపీ కొత్త జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా... ఎన్నిక ఏకగ్రీవం
Recommended Video
న్యూఢిల్లీ: ఊహించినట్లుగానే జరిగింది. బీజేపీ జాతీయాధ్యక్షుడిగా జగత్ ప్రకాష్ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇప్పటి వరకు పనిచేసిన జేపీ నడ్డా... ఇక బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ప్రమోషన్ పొందారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ చీఫ్గా బాధ్యతల నుంచి వైదొలిగి జేపీ నడ్డాను తన వారసుడిగా ప్రకటించారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన బీజేపీ అగ్రనాయకుల సమక్షంలో బీజేపీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా పేరును ప్రతిపాదించారు.

ఏకగ్రీవంగా ఎన్నికైన జేపీ నడ్డా
అధికారిక బీజేపీ పార్టీలో జేపీ నడ్డా ఇప్పటి వరకు మూడోస్థానంలో ఉన్నారు. జేపీ నడ్డాకు పోటీగా ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు బీజేపీ ఎన్నికల యూనిట్ ప్రకటించింది. ఎన్నికను పర్యవేక్షిస్తున్న సీనియర్ బీజేపీ నేత రాధామోహన్ సింగ్ జేపీ నడ్డా బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించారు.

జేపీ నడ్డా పేరును ప్రతిపాదించిన అమిత్ షా, గడ్కరీ, రాజ్నాథ్
ఇక లాంఛనాలను పూర్తి చేసే సమయంలో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. ఇక పార్టీ జాతీయాధ్యక్ష పదవికి పార్లమెంటరీ బోర్డు మాజీ సభ్యులైన అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలు ప్రతిపాదించారు. ఈ సమయంలో బీజేపీ పార్టీకి అమిత్ షా చేసిన సేవలను కొనియాడారు రాజ్నాథ్ సింగ్. పార్టీని మరో ఎత్తుకు అమిత్ షా తీసుకెళ్లారని రాజ్నాథ్ సింగ్ అన్నారు.

జేపీ నడ్డా ముందు ప్రధాన సవాళ్లు
ప్రధాని మోడీ, అమిత్ షాల నమ్మకాన్ని జేపీ నడ్డా చూరగొన్నారు. అయితే బీజేపీ జాతీయాధ్యక్షుడిగా కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న జేపీ నడ్డా ముందు పలు సవాళ్లు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ వరుస ఓటములు చూస్తున్న నేపథ్యంలో ఆయనకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పెనుసవాలుగా మారనున్నాయి. ఆ తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ జేడీయూతో కలిపి బీజేపీ ప్రభుత్వంలో ఉంది. అంతేకాదు 2021లో జరిగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడే బీజేపీ మెగా ప్రచారానికి తెరదీసింది.

విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో...
జేపీ నడ్డా హిమాచల్ ప్రదేశ్కు చెందిన వారు. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తి. విద్యార్థి రాజకీయాల నుంచి ఆర్ఎస్ఎస్లో చేరి ఆపై బీజేపీతో ప్రయాణిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 1998 నుంచి 2003 వరకు కేంద్ర మంత్రిగా పనిచేశారు. మోడీ తొలి ప్రభుత్వంలో జేపీ నడ్డా కేంద్రమంత్రి పదవి చేపట్టారు. అనంతరం గతేడాది జూలైలో ఆయన్ను బీజేపీ అధిష్టానం వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించింది. కేంద్రమంత్రిగా తనకు బాధ్యతలు ఎక్కువగా కావడంతో బీజేపీ జాతీయాధ్యక్ష పదవిని మరొకరికి కేటాయించాలంటూ అమిత్ షా ప్రధాని మోడీకి లేఖ రాశారు. జూన్ 2019 నుంచి అమిత్ షా బీజేపీ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు.












Click it and Unblock the Notifications