బీజేపీ కొత్త జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా..? వచ్చేవారమే ఎన్నిక
న్యూఢిల్లీ: ప్రస్తుత బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు త్వరలో బీజేపీ జాతీయాధ్యక్షుడి బాధ్యతలు అప్పగించనున్నారా..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీ జాతీయాధ్యక్షుడిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నారు. వచ్చేవారంలో అమిత్షా దిగిపోయి ఆ పదవిని జేపీ నడ్డా చేపడుతారని ఢిల్లీలో వార్తలు షికారు చేస్తున్నాయి. జేపీ నడ్డా పార్టీ చీఫ్గా నియమించబడితే మరో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవి కోసం ఎన్నిక షెడ్యూల్ త్వరలోనే ఆ పార్టీ విడుదల చేయనుంది.
ఒక్కసారి ఎన్నిక షెడ్యూల్ను పార్టీ విడుదల చేస్తే జేపీ నడ్డా బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవుతారనే విశ్వాసం పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. 2014లో అప్పటి బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తర్వాత ఆ పదవిని చేపట్టిన అమిత్ షా పదవీకాలం ముగియనుంది. 2016 జనవరిలో అమిత్ షా రెండోసారి జాతీయాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
ఇక జాతీయాధ్యక్షుడి ఎన్నికకు నామినేషన్ గడువు జనవరి 20 ఉంటుందని తెలుస్తోంది. ఒకవేళ అంతా అనుకుంటున్నట్లుగానే ఆ పదవికి ఎవరూ నామినేషన్ వేయకుంటే బీజేపీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటన వస్తుంది. అమిత్ షా బీజేపీ జాతీయాధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టాక బీజేపీలో ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత రెండో స్థానంలో నిలిచారు.ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంకు ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్న నేపథ్యంలో జేపీ నడ్డా బీజేపీ జాతీయాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనుండటం విశేషం.
అంతేకాదు జేఎన్యూలో హింసాత్మక ఘటన కూడా నడ్డాకు సవాల్గా మారనుంది. ఇక మహారాష్ట్రలో బీజేపీని కాదని కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేన, హర్యానాలో బొటాబొటి మెజార్టీ, జార్ఖండ్లో బీజేపీ ఓటమి ఇలా పలు అంశాలతో బీజేపీ వెనకంజలో ఉంది. ఇక వచ్చేనెలలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా జేపీ నడ్డాకు ఇది పెను సవాలుగా మారే అవకాశం ఉంది. మరి జేపీ నడ్డా పార్టీని తిరిగి ఏమేరకు పుంజుకునేలా వ్యూహాలు రచిస్తారో వేచిచూడాలి.