జడ్జి భార్య కొడుకు రాక్షసులు అందుకే కాల్పులు జరిపాను: మహిపాల్ సింగ్
గురుగ్రామ్లో సెషన్స్ జడ్జి భార్యను అతని కుమారుడిని వ్యక్తిగత భద్రతా సిబ్బంది కాల్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో జడ్జి భార్య మృతి చెందగా కొడుకు ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. అయితే ఎందుకోసం వారిపై కాల్పులు జరపాల్సి వచ్చిందో నిందితుడు మహిపాల్ సింగ్ కారణాలను స్పష్టం గా తెలపడం లేదని పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే పోలీస్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న మహిపాల్ సింగ్ను పోలీస్ శాఖ నుంచి తొలగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో సింగ్ ఉన్నాడు. కాల్పులు జరిపిన సమయంలో ఆయన మానసిక పరిస్థితి బాగానే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
జడ్జి భార్య రితూ, కొడుకు ధృవ్ ఇద్దరూ రాక్షసులు అందుకే వారిని చంపాలని చూసినట్లు మహిపాల్ పోలీసుల విచారణలో మహిపాల్ వెల్లడించినట్లు క్రైమ్ డీసీపీ సుమీత్ కుహార్ తెలిపారు. వారిని రాక్షసులతో ఎందుకు పోల్చావని అడుగగా... రాక్షసులంటే చెడ్డవారు. వీరుకూడా ఇంతే అని సమాధానం చెప్పినట్లు డీసీపీ వెల్లడించారు. విచారణ సమయంలో తొలుత చాలా ఆగ్రహంతో ఊగిపోయాడని పోలీసులు వెల్లడించారు. జడ్జి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
షాపింగ్కు వెళ్లి వచ్చాక ధృవ్ నిందితుడిని కారు తాళాలు అడిగినట్లు ఎఫ్ఐఆర్లో ఉంది. కారు తాళాలు అడగడంతో ఆగ్రహానికి గురయ్యాడు మహిపాల్ సింగ్. అంతేకాదు రితూ, ధృవ్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అనంతరం ముందుగా రితూపై కాల్పులు జరిపాడు. రితూను కాపాడేందుకు ప్రయత్నించిన ధృవ్ పై కూడా మహిపాల్ సింగ్ కాల్పులు జరిపినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అధిక రక్తస్రావం కావడంవల్లే రితూ మృతి చెందిందని పోస్టు మార్టం రిపోర్టులో వైద్యులు పేర్కొన్నారు. గుండెలోకి బుల్లెట్ దూసుకుపోయిందని వారు తెలిపారు.
జడ్జి కుటుంబం తనను కుక్క కంటే హీనంగా చూసేవారని పోలీసులు విచారణ సమయంలో మహిపాల్ తెలిపారు. తనతో అన్ని పనులు చేపించుకునే వారని వెల్లడించాడు. అంతేకాదు ధృవ్ తన వ్యక్తిగత పనులు కూడా చేయించుకునేవాడని అది తనను ఇబ్బంది పెట్టినట్లు మహిపాల్ వెల్లడించాడు. వారి కుక్కకు స్నానం చేయించడంతో పాటు అది మూత్ర మల విసర్జన చేసినప్పుడు తనతోనే క్లీన్ చేయించేవారని పేర్కొన్నాడు. ఒక కుక్కకు పోలీసుకు వారి దృష్టిలో పెద్ద తేడా లేదని వెల్లడించాడు.