అలాంటి పరిస్థితులను కోరుకోవట్లేదు- కానీ: సీజేఐ చంద్రచూడ్
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల అత్యున్నత స్థాయి సమావేశం ఇవ్వాళ ఆరంభమైంది. సీజేఐ డీవై చంద్రచూడ్ ఇందులో పాల్గొన్నారు.
న్యూఢిల్లీ: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల అత్యున్నత స్థాయి సమావేశం ఇవ్వాళ ఆరంభమైంది. దేశ రాజధాని దీనికి వేదికైంది. మూడు రోజుల పాటు కొనసాగే సమావేశాలు ఇవి. భారత్ తరఫున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇందులో పాల్గొన్నారు. ప్రారంభోపన్యాసం చేశారు. కీలక వ్యాఖ్యలు చేశారాయన.
కోవిడ్ 19 వంటి మహమ్మారి పరిస్థితులను జ్యుడీషియరీ వ్యవస్థ కోరుకోవట్లేదని వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ తరహా పరిస్థితుల్లో అందుబాటులోకి వచ్చిన వర్చువల్ విచారణలు, వీడియో కాన్ఫరెన్స్ వంటి అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, అభివృద్ధి చెందాలని చెప్పారు. అప్పుడే సత్వర న్యాయాన్ని అందించడంలో కొంతవరకైనా విజయం సాధించినట్టవుతుందని పేర్కొన్నారు.

సత్వర న్యాయాన్ని అందించడంలో ఆధునిక పద్ధతులను అనుసరించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కోవిడ్ పరిస్థితులు గుర్తు చేశాయని సీజేఐ డీవై చంద్రచూడ్ చెప్పారు. డిజిటలైజేషన్ ను తాము ప్రోత్సహిస్తూనే ఉన్నామని, దేశ న్యాయవ్యవస్థలో సాంకేతికతను జొప్పించడం వల్ల న్యాయవ్యవస్థ పౌరులందరికీ సత్వర న్యాయాన్ని అందించగలుగుతుందని వ్యాఖ్యానించారు.
వర్చువల్/హైబ్రిడ్ విచారణలు, న్యాయవాదులు తమ కేసులను వాదించడానికి దేశంలోని ఏ ప్రాంతం నుంచి అయినా కోర్టుల ముందు హాజరయ్యే అవకాశం లభించిందని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు. సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగపరమైన కేసుల ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. దీనికోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తోన్నామని అన్నారు. ప్రాంతీయ భాషల్లో కూడా ఇది అందుబాటులో ఉందని, ఫలితంగా న్యాయ విచారణలో పారదర్శకతను పెరుగుతుందని చెప్పారు.
ఇ-కోర్టులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్ లైన్ విచారణలు, అత్యవసర విచారణల కోసం వర్చువల్ విధానం, లైవ్ స్ట్రీమింగ్ లను రూపొందించడంలో సుప్రీంకోర్టు- పరిస్థితులకు అనుగుణంగా స్పందించిందని, దానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుందని వివరించారు. ఇమెయిల్, ఫ్యాక్స్ లేదా ఇన్ స్టంట్ మెసెంజర్ సర్వీస్ ద్వారా నోటీసులు, సమన్లను జారీ చేయడాన్ని అనుమతించామని చెప్పారు.












Click it and Unblock the Notifications