గ్రాండ్ షో : మోడీ నామినేషన్ సర్వం సిద్ధం..అంతకంటే ముందు ఇదీ ప్రధాని షెడ్యూల్
వారణాసి: ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 26న తాను పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం బీజేపీ చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తోంది. ఆరుకిలోమీటర్ల మేరా రోడ్ షో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ప్రధానిగా తనకు రెండో సారి అవకాశం ఇవ్వాలని ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధికంటే రెట్టింపు చేస్తానని మోడీ చెప్పుకొస్తున్నారు.
ఏప్రిల్ 25 షెడ్యూల్ ఇదీ
ఏప్రిల్ 26... దేశం మొత్తం చూపు ఆ రోజు వారణాసి వైపే ఉంటుంది. ఇందుకు కారణం ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు భారం మొత్తం మోడీ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ఇప్పటికే మోడీ నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని చాలా ఘనంగా ప్లాన్ చేసింది బీజేపీ అధిష్టానం. అంతకంటే ముందు అంటే ఏప్రిల్ 25వ తేదీన మెగా రోడ్షోను తలపెట్టింది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రధాని మోడీ వారణాసిలోని బబతాపూర్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి బనారస్ హిందూ యూనివర్శిటీ హెలీప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి కారులో లంకకు బయలు దేరుతారు. ఇక ఇక్కడి నుంచే ఆయన రోడ్ షో ప్రారంభమవుతుంది. ముందుగా మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి పూలమాలలు వేసి తన రోడ్షోను ప్రారంభిస్తారు మోడీ.
మోడీ రోడ్ షోకు హాజరుకానున్న అగ్రనేతలు
2014 ఎన్నికల సమయంలో తనకు తానుగా వారణాసికి రాలేదని తల్లి గంగా నది తనను ఇక్కడకు తీసుకొచ్చిందంటూ చెప్పుకొచ్చారు ప్రధాని మోడీ. ఈ సారి కూడా బీజేపీ చాలా గ్రాండ్గా ప్లాన్ చేసింది. వీలైనంత ఎక్కువ మంది ప్రజలను సమకూర్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇక మోడీ రోడ్ షో దాదాపు 6 కిలోమీటర్ల మేరా జరగనుంది. లంక నుంచి దశస్వమేధా ఘాట్ వయా గోడోలియా మీదుగా రోడ్షో జరగనుంది. మోడీతో పాటు బీజేపీ సీనియర్ నేతలు కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, సుష్మా స్వరాజ్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్లు పాల్గొంటారు. ఇక బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఎలాగూ హాజరవుతారు.అంతేకాదు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ రోడ్షోకు హాజరుకానున్నట్లు సమాచారం. ఎన్డీఏ కూటమి పక్షాలు అయితన శిరోమణి అకాళీదల్ చీఫ్ ప్రకాష్ సింగ్ బాదల్, శివసేన బాస్ ఉద్ధవ్ థాక్రే, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, లోక్జన్శక్తి పార్టీ చీఫ్ రామ్ విలాస్ పాశ్వాన్ కూడా రోడ్షోలో పాల్గొంటారు.
రోడ్ షో తర్వాత గంగమ్మకు హారతి ఇవ్వనున్న ప్రధాని
ఇక రోడ్షోలో మొత్తం బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని దారిపొడవున పూల వర్షం కురిపిస్తారు. మొత్తం 101 స్వాగత ద్వారాలను బీజేపీ ఏర్పాటు చేసింది. వీటిని 10 బ్లాకులుగా విభజించిన కమలం పార్టీ... ఈ బ్లాకులను మొత్తం ఎమ్మెల్యేలు పర్యవేక్షిస్తారు. దాదాపుగా 6 లక్షల మంది ప్రజలు ఈ మెగా రోడ్షోలో పాల్గొంటారని అంచనా. ఇప్పటికే మోడీ రోడ్షోలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా వారణాసి ప్రజలకు బహిరంగ ఆహ్వానం పంపింది పార్టీ అధిష్టానం. ఇక రోడ్ షో ముగిసిన తర్వాత నరేంద్ర మోడీ గంగా నదికి హారతి పడతారు.అక్కడి నుంచి కాశీ విశ్వనాథ్ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత వారణాసిలోని డి పారిస్ హోటల్లో 3వేల మంది స్థానిక ప్రముఖులతో సమావేశం అవుతారు.
ఏప్రిల్ 26న మోడీ నామినేషన్ దాఖలు
ఏప్రిల్ 26న ప్రధాని మోడీ స్థానిక కాలభైరవ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత బూతు స్థాయి కార్యకర్తలతో సమావేశమై ఎన్నికల్లో గెలిచేందుకు చిట్కాలు చెబుతారు. వీరితో సమావేశం అయ్యాక ప్రధాని నరేంద్ర మోడీ తన నామినేషన్ దాఖలు చేసేందుకు బయలుదేరి వెళతారు. 2014లో ఎలాగైతే ఘనవిజయాన్ని తనకు అందించారు అంతకంటే మెరుగైన మెజార్టీ ఈ సారి ఇవ్వాలని మోడీ కోరనున్నారు. 2014లో ప్రధాని మోడీ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిపై 3లక్షల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. మరోవైపు ఈ సారి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకాగాంధీని ఆపార్టీ వారణాసి నుంచి బరిలోకి దింపే సూచనలు కనిపిస్తున్నాయి. మే 19న వారణాసిలో ఎన్నికలు జరగనున్నాయి.