రేపు సుప్రీంకోర్టు సీజేగా ఎన్వీరమణ ప్రమాణస్వీకారం- నిరాడంబరంగా- అతిధులు వీరే
సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే పదవీకాలం ఇవాళ్టితో ముగియనుంది. దీంతో రేపు జస్టిస్ ఎన్వీరమణ ఆయన వారసుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇప్పటికే తదుపరి సీజేగా ఆయన పేరుకు రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది.
దేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి తర్వాత అత్యున్నత పదవి అయిన భారత ప్రధాన న్యాయమూర్తి పదవిని తెలువాడైన జస్టిస్ ఎన్వీ రమణ చేపట్టబోతున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ రేపు భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్యమైన అతిధుల్ని మాత్రమే ఆహ్వానించారు. ఇందులో ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేబినెట్ మంత్రులు, ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు హాజరవుతారు.

ఏపీలోని కృష్ణాజిల్లా పొన్నవరానికి చెందిన ఎన్వీరమణ న్యాయవాదిగా జీవితాన్ని ఆరంభించి అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా ఆయన పనిచేశారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమోషన్ లభించింది. అనంతరం సుప్రీంకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా జస్టిస్ రమణ నియమితులయ్యారు. ఇప్పుడు సీనియార్టీ ఆధారంగా ఆయనకు ఛీఫ్ జస్టిస్ పదవి లభించబోతోంది. రేపు సీజేగా బాధ్యతలు చేపట్టబోతున్న జస్టిస్ రమణ వచ్చే ఏడాది ఆగస్టు వరకూ ఈ పదవిలో ఉంటారు. తద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో జస్టిస్ కపాడియా తర్వాత అత్యధిక కాలం ఈ పదవిలో ఉండే సీజేగా కూడా జస్టిస్ రమణ గుర్తింపు పొందనున్నారు.












Click it and Unblock the Notifications