ఏనుగు కేసులో ముగ్గురు అరెస్ట్: న్యాయం జరుగుతుందన్న సీఎం, ఫారెస్ట్ అధికారి వాదన మరోలా
తిరువనంతపురం: పైనాపిల్లో పేలుడు పదార్థాలు పెట్టి గర్భంతో ఉన్న ఏనుగును దారుణంగా చంపిన ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్రంగా స్పందించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని అన్నారు.
దేశ వ్యాప్తంగా ఈ ఘటనపై జనం వ్యక్తం చేస్తున్న ఆవేదనను అర్థం చేసుకోగలనని అన్నారు.

ముగ్గురు అనుమానితుల గుర్తింపు..
ఏనుగును చంపిన ఘటనలో ఇప్పటికే ముగ్గురు అనుమానితులను గుర్తించామని, దర్యాప్తు కొనసాగుతోందని ట్విట్టర్ వేదికగా సీఎం విజయన్ వెల్లడించారు. కాగా, మలప్పురం జిల్లాలో ఈ ఘటన జరిగినట్లు మోహన కృష్ణ అనే ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు. అయితే, ఈ ఘటన పాలక్కడ్ జిల్లాలో జరిగినట్లు అధికారులు తెలిపారు. కేరళలో రెండు ఏనుగులు హత్యకు గురికావడం గమనార్హం.

నిందితులను కఠినంగా శిక్షిస్తాం..
గర్భంతో ఉన్న ఏనుగును చంపిన ఘటనపై జిల్లా పోలీసు, ఫారెస్ట్ చీఫ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తాం అని విజయన్ తెలిపారు.
కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. నిందితులు తప్పించుకునేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వమని, వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తామన్నారు. ఆహారంలో పేలుడు పదార్థాలు కలిపి చంపడం మనదేశ సంస్కృతి కాదని అన్నారు.
Recommended Video

బాంబు పెట్టిన పైనాపిల్ తినకపోవచ్చంటూ.. ఫారెస్ట్ అధికారుల వాదన
ఏనుగు మృతికి పేలుడు పదార్థాలున్న పైనాపిల్ తినడమే కారణమని ఖచ్చితంగా చెప్పలేమని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఆ ఏనుగు పైనాపిల్ కాకుండా అడవి పందుల కోసం బెల్లం పూత పూసిన బాంబును తిని ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డిటైల్ పోస్టుమార్టమ్ వస్తే తప్ప దీనిపై స్పష్టత ఇవ్వలేమని వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ సురేంద్రన్ కుమార్ తెలిపారు. కేరళలోని చాలా పొలాల్లో అడవిపందులు రాకుండా రైతులు బాంబులకు బెల్లంపూత పూసి పొలాల్లో పెడతారని, ఒక్కోసారి ఏనుగులు కూడా వాటిని తింటాయని.. దాని వల్ల ప్రమాదాలు జరుగుతాయన్నారు. కాగా, పేలుడు పదార్థాలు తినడం కారణంగానే ఆ ఏనుగు ప్రాణాలు కోల్పోయిందని ప్రాథమిక పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది.












Click it and Unblock the Notifications