Tamilnadu Election Results 2021 : కమల్ హాసన్కు షాక్... బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి...
మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు,సినీ నటుడు కమల్ హాసన్ ఓటమిపాలయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన సమీప ప్రత్యర్థి,బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్పై 1500 ఓట్ల తేడాతో ఓడిపోయారు.దీంతో అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న ఆయన కోరిక నెరవేరకుండా పోయింది.
ఈ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత కొన్ని రౌండ్ల పాటు కమల్ ఆధిక్యం కనబరిచారు. కానీ చివరి రౌండ్లలో అనూహ్య రీతిలో వనతి శ్రీనివాసన్ పుంజుకున్నారు. చివరకు కమల్హాసన్పై విజయం సాధించారు. శ్రీనివాసన్ ప్రస్తుతం బీజేపీ జాతీయ మహిళా విభాగం చీఫ్గా వ్యవహరిస్తున్నారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ నేత్రుత్వంలో మూడో కూటమి ఏర్పడిన సంగతితెలిసిందే. మక్కల్ నీది మయ్యం,ఇండియా జన నాయక కట్చి,సమత్తువ మక్కల్ కట్చి పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. ఎంఎన్ఎం 154, ఎస్ఎంకే, ఐజేకే చెరో 40 స్థానాల్లో పోటీ చేశాయి. అయితే తమిళ ఎన్నికల్లో ఈ కూటమి ప్రభావం ఎక్కడా కనిపించలేదు.
అంతా ఊహించినట్లే ఈ ఎన్నికల్లో డీఎంకె సత్తా చాటింది. ఇప్పటివరకూ ఉన్న ట్రెండ్స్ ప్రకారం 150 పైచిలుకు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో ప్రస్తుతం డీఎంకె 150 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ 117ని దాటడంతో డీఎంకె విజయం ఇప్పటికే ఖరారైంది. ఇక డీఎంకెతో పొత్తు పెట్టుకున్న వీసీకె పార్టీ ఆరు స్థానాల్లో పోటీ చేసి నాలుగింటిలో విజయం సాధించడం విశేషం. డీఎంకె గెలుపుతో స్టాలిన్ మొదటిసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు.
తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా విజయం సాధించారు. డీఎంకె కంచుకోట,తన తాత కరుణానిధి నియోజకవర్గమైన చెపాక్ నియోజకవర్గం నుంచి ఉదయనిధి స్టాలిన్ గెలుపొందారు. దీంతో తాతకు తగ్గ మనవడిగా ఉదయనిధి స్టాలిన్పై ప్రశంసలు కురుస్తున్నాయి.












Click it and Unblock the Notifications