కమల్ సంచలనం: తమిళనాడులో బీజేపీకి 'ఆ టైమ్' రాలేదు!..
బీజేపీ ప్రయత్నాలు ఎలా ఉన్నప్పటికీ.. ఆ పార్టీకి తమిళనాడులో ఇంకా టైమ్ రాలేదన్నారు ప్రముఖ నటుడు కమల్ హాసన్. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ కమల్ ఈ విషయాన్ని ప్రస్తావించారు.
చెన్నై: ఉత్తరాదిలో ఊపు మీదున్న బీజేపీ.. అదే ఊపులో దక్షిణాదిలోను పాగా వేయాలని ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన వ్యూహాలు సిద్దమవుతున్నాయి. దక్షిణాదిలో భాగంగా తమిళ రాజకీయాల మీద బీజేపీ సీరియస్ గానే ఫోకస్ చేసింది.
దివంగత సీఎం జయలలిత మరణంతో.. తమిళనాడులో పార్టీని విస్తరణకు అవకాశం ఏర్పడిందని బీజేపీ భావించింది. ఇదే క్రమంలో ఆర్కేనగర్ ఉపఎన్నికలోను గెలిచి సత్తా చాటాలని భావించినప్పటికీ.. దినకరన్ ఎపిసోడ్ తో సీన్ రివర్స్ అయిన సంగతి తెలిసిందే.
బీజేపీ ప్రయత్నాలు ఎలా ఉన్నప్పటికీ.. ఆ పార్టీకి తమిళనాడులో ఇంకా టైమ్ రాలేదన్నారు ప్రముఖ నటుడు కమల్ హాసన్. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ కమల్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. తమిళనాడు పరిస్థితులు బీజేపీకి అనుకూలిస్తాయా? లేదా? అన్న సంగతి తనకు తెలియదని, కానీ రాష్ట్రంలో ఆ పార్టీకి ఇంకా టైమ్ రాలేదని కమల్ అన్నారు.
తమిళ రాజకీయాల్లో జాతీయ నాయకుల జోక్యం పెరుగుతోందన్న ప్రశ్నకు.. దేశంలో తమిళనాడు ఒక భాగమని, ఇక్కడి అభివృద్ధిలో ఎవరైనా భాగస్వామ్యం కలిగి ఉండవచ్చునని పేర్కొన్నారు.