కంగనా రనౌత్కు బిగ్ షాక్.. ట్విట్టర్ ఖాతా శాశ్వతంగా తొలగింపు.. మారణహోమాన్ని కోరినందుకే?
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్కు ట్విట్టర్ గట్టి షాకిచ్చింది. కంగనా ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా తొలగిస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కంగనా చేసిన వరుస ట్వీట్లు విద్వేషపూరితంగా,వివాదాస్పదంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కంగనా ట్విట్టర్ నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంది. ట్విట్టర్ చర్యపై కంగనా కూడా ఘాటుగా స్పందించారు. ట్విట్టర్ కాకపోతే మరో వేదిక నుంచి తన గొంతు వినిపిస్తానని... తన గళం వినిపించేందుకు సినిమా రూపంలో సొంత కళా వేదిక కూడా ఉందని స్పష్టం చేశారు.
ఇంతకీ కంగనా చేసిన ట్వీట్ ఏంటి...
బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్రంలో చాలా హింస చోటు చేసుకుంటోందంటూ కంగనా కొన్ని ట్వీట్లు చేశారు. ఇదే క్రమంలో జర్నలిస్టు,బీజేపీ నాయకురాలు స్వపన్ దాస్ గుప్తా చేసిన ట్వీట్పై కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'ఇది చాలా ఘోరం... ఈ గూండాలను చంపాలంటే మనకు సూపర్ గూండాలు అవసరం... ఆమె ఓ రాక్షసి... కాబట్టి మోదీజీ మీరు 2000 సంవత్సరం ప్రారంభంలో ఉన్న మీ విశ్వరూపాన్ని చూపించి ఆమెను మచ్చిక చేసుకోవాలి.' అని కంగనా ట్వీట్ చేశారు. అంటే,బెంగాల్లో మారణహోమం జరగాలని కంగనా పరోక్షంగా చెబుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. కంగనాపై చర్యలు తీసుకోవాల్సిందేనని చాలామంది నెటిజన్లు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో బాలీవుడ్ నుంచి కూడా ఆమెను బాయ్కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సహన్ దాస్ గుప్తా ట్వీట్లో ఏముంది...
సహన్ దాస్ గుప్తా చేసిన ట్వీట్లో బెంగాల్లో చెలరేగుతున్న హింస గురించి ప్రస్తావించారు. 'భిర్బుమ్ జిల్లాలోని ననూర్లో పరిస్థితి అదుపు తప్పేలా కనిపిస్తోంది. బీజేపీ వ్యతిరేక మూకల దాడుల నుంచి తప్పించుకునేందుకు వేలాది మంది హిందూ కుటుంబాలు ఇళ్లు వదిలి పొలాల్లోకి పారిపోతున్నారు. మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వెంటనే ఇక్కడికి కేంద్ర బలగాలను పంపించాలి.' అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై స్పందిస్తూ కంగనా వివాదాస్పద ట్వీట్ చేయడం ట్విట్టర్ ఆమె ఖాతాను తొలగించడానికి కారణమైంది.
ట్విట్టర్ ఏం చెబుతోంది...
కంగనా ఖాతాను శాశ్వతంగా తొలగించడంపై ట్విట్టర్ ప్రతినిధి మాట్లాడుతూ... 'సమాజానికి హాని కలిగించే రీతిలో చేసే ట్వీట్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్న స్పష్టతతో మేమున్నాం. ట్విట్టర్ నిబంధనలను పదే పదే ఉల్లంఘించడం... విద్వేషపూరిత,వివాదాస్పద ట్వీట్లు చేయడంతో ఆమె ఖాతాను శాశ్వతంగా నిలిపివేస్తున్నాం.' అని స్పష్టం చేశారు. కంగనా రనౌత్ ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలు అంశాలపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. బీజేపీ మద్దతుతోనే ఆమె ఇంతలా చెలరేగిపోతున్నారన్న విమర్శలున్నాయి. కంగనాకు బీజేపీ వై ప్లస్ కేటగిరీ భద్రత కూడా కల్పించిన సంగతి తెలిసిందే.
బెంగాల్లో చెలరేగిన హింస..
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ముచ్చటగా మూడోసారి విజయం సాధించగా... ఫలితాలు వెలువడిన 24 గంటల్లోపే అక్కడ అల్లర్లు చెలరేగాయి. బెంగాల్లోని పలు ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఆరుగురు బీజేపీ కార్యకర్తలు చనిపోయారని ఆరోపించింది. పార్టీ కార్యాలయాలు,ఇళ్లు ధ్వంసం చేస్తున్నారని పేర్కొంది. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. కాగా, బెంగాల్లో 292 స్థానాలకు ఎన్నికలు జరగగా 213 సీట్లలో తృణమూల్, బీజేపీ 77, లెఫ్ట్-కాంగ్రెస్ 1, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందిన విషయం తెలిసిందే.