లోక్సభలో నటి రమ్య తొలి ప్రసంగం: సభ్యుల మద్దతు
న్యూఢిల్లీ: కన్నడ నటి రమ్య దివ్య స్పందన (27) తొలిసారిగా లోక్సభలో శుక్రవారం ప్రసంగించారు. 2013లో కర్ణాటకలోని మాండ్య పార్లమెంటరీ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన ఆమె లోక్సభకు ఎన్నికయ్యారు.
15వ లోక్సభ సమావేశాల్లో చివరి రోజైన శుక్రవారం తొలిసారి ప్రసంగించిన రమ్య దివ్య స్పందన, హరిత ఇంధన ఉపయోగంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇథనాల్ వంటి ఇంధనాన్ని చెరకు ఉప ఉత్పత్తుల నుంచి పొందవచ్చని ఆమె పేర్కొన్నారు.

గ్రీన్ ఇంధనమైన ఇథనాల్ ఉత్పత్తి కోసం చెరకు రైతులకు అవగాహన కల్పించాలని దివ్య కోరారు. వారికి అవగాహన కల్పించడం వల్ల గ్రీన్ ఇంధన ఉత్పత్తి మరింత సులభమవుతుందని చెప్పారు. బ్రెజిల్ దేశంలో 44శాతం మంది ప్రజలు ఇథనాల్ ఇంధనాన్ని ఉపయోగించి తమ రవాణాను కొనసాగిస్తున్నారని రమ్య దివ్య స్పందన తెలిపారు.
ఒక వేళ మనదేశం పెద్ద ఎత్తున ఇథనాల్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసినట్లయితే, ఇతర దేశాల నుంచి ఇంధన దిగుమతిని క్రమంగా తగ్గించుకోవచ్చని ఆమె అన్నారు. తనకు స్వాగతం పలికిన ఇతర పార్లమెంటు సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బల్లలు చరుస్తూ ఆమె ప్రసంగానికి సభ్యులు మద్దతు తెలిపారు.












Click it and Unblock the Notifications