కర్ణాటక గెలుపు అసాధారణం.. 'కాంగ్రెస్ ముక్త్ భారత్'కే ఓటేశారు: మోడీ
న్యూఢిల్లీ: కర్ణాటక ఎన్నికల్లో విజయం మహాదానందాన్ని ఇస్తోందని, విభజించు పాలించు అన్న కాంగ్రెస్ సిద్దాంతాన్ని ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఆయన మాట్లాడారు.
పదే పదే అబద్దాలు చెబితే నమ్మడానికి ప్రజలు సిద్దంగా లేరని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మోడీ విమర్శించారు. కర్ణాటకలో బీజేపీ విజయానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. బీజేపీని ఉత్తరాది పార్టీగా ముద్ర వేశారని, కానీ కన్నడ ఓటరు తీర్పుతో ఆ ముద్ర చెరిగిపోయిందని అన్నారు. హిందీయేతర రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలవడమే అందుకు నిదర్శనం అన్నారు.

కర్ణాటకలో బీజేపీ గెలుపు అసాధారణమని, కాంగ్రెస్ ముక్త్ భారత్ కే ప్రజలు ఓటు వేశారని అన్నారు. దక్షిణాది, ఉత్తరాది అని కాంగ్రెస్ విభజించు పాలించు అన్న సిద్దాంతాన్ని ఫాలో అవుతోందని, ప్రజలు దాన్ని తిరస్కరించారని అన్నారు. కర్ణాటకలో తనకెప్పుడూ భాష అడ్డంకి కాలేదన్నారు.
ప్రాంతాలు, భాష వేరైనా మనమంతా ఒకటేనని స్పష్టం చేశారు.
దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు బీజేపీ చేరువైందని, తమ పార్టీ అన్ని యావత్ భారత్ అభివృద్దిని కోరుకుంటోంది కాబట్టే అది సాధ్యపడిందని పేర్కొన్నారు.
ఎన్ని కుట్రలు చేసినా మేమే గెలిచాం: అమిత్ షా
ఫేక్ ఓటరు ఐడీ కార్డులతో రిగ్గింగ్ కు పాల్పడాలనుకున్న కుట్రలను కన్నడ ప్రజలు తిప్పికొట్టారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. బీజేపీ గెలుపు కోసం లక్షలాది మంది కార్యకర్తలు కష్టపడి పనిచేశారని అన్నారు.కాంగ్రెస్ కేబినెట్ లోని సగానికి పైగా మంత్రులు ఓడిపోయారని గుర్తుచేశారు. స్వలాభం కోసం ప్రజలు, రాష్ట్రాల మధ్య కొన్ని పార్టీలు విభేదాలు సృష్టిస్తున్నాయని అన్నారు.
రాహుల్ అధ్యక్షుడయ్యాక కులం, మతం కారణంతో దేశ ప్రజలను విడగొట్టే కుట్ర జరిగిందన్నారు. ఇన్ని కుట్రలు చేసినా ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని అన్నారు. కర్ణాటకలో తమ ఓటు బ్యాంకు పెరిగిందని, 2019 ఎన్నికల్లోనూ తమదే విజయమని అన్నారు. మోడీ నాయకత్వంలో బీజేపీ విజయాల పరంపర కొనసాగుతుందన్నారు.












Click it and Unblock the Notifications