మద్యం మత్తులో వరుడు: పెళ్లి రద్దు చేసిన వధువు
కాన్పూర్: పూటుగా మద్యం తాగి తూలుతూ పెళ్లిపీటలెక్కిన ఓ వరుడుకి వధువు షాకిచ్చింది. పెళ్లి మండపానికి మద్యం మత్తులో రావడంతో నవ వధువు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేగాక, తాగుబోతు మొగుడు నాకొద్దంటూ అక్కడినుంచి లేచి వెళ్లిపోయింది.
ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్లో చోటుచేసుకుంది. కాన్పూర్లోని సిఘౌల్ ప్రాంతానికి చెందిన సజేతి(23)కి అదే ప్రాంతానికి చెందిన సురేందర్ తివారీతో పెళ్లి కుదిరింది. మరికొద్దిసేపట్లో పెళ్లి జరగబోతుందనగా వరుడు తన స్నేహితులతో పీకల్దాకా తాగి తూలుతూ మండపానికి వచ్చాడు.

ఇది చూసిన వధువు తీవ్ర ఆగ్రహానికి గురైంది. తనకి ఈ పెళ్లి వద్దని తేల్చిచెప్పేసింది. వరుడి తల్లిదండ్రులు ఎన్ని విధాలుగా నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా తన నిర్ణయం మార్చుకోలేదు వధువు.
దీంతో పోలీసుల జోక్యం లేకుండానే ఇరు కుటుంబాలవారు చర్చించుకుని పెళ్లి రద్దు చేసుకున్నారని ఎస్పీ సురేంద్ర తివారీ చెప్పారు.












Click it and Unblock the Notifications