షాకింగ్: పోలీస్ శాఖలో ఇంటి దొంగలు.. గ్యాగ్స్టర్ వివేక్ దుబేకు ఉప్పందించడం వల్లే కాన్పూర్ ఎన్కౌంటర్
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కాన్పూర్ ఎన్ కౌంటర్ ఘటనలో ఊహించని వాస్తవాలు బయటపడుతున్నాయి. ఒక డీఎస్పీ సహా 8 మంది పోలీసులను నేరస్తులు కిరాతకంగా హతమార్చడం వెనుక ఇంటి దొంగల హస్తం ఉన్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. కరడుగట్టిన గ్యాంగ్స్టర్ వివేక్ దుబేతో చౌబేపూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో వినయ్ తివారీకి లింకులు ఉన్నాయని, అతను ఉప్పందించడం వల్లే పోలీసులు చనిపోయారని నిర్ధారణ అయింది. దీంతో అతనిపై సస్పెన్షన్ వేటేసి,విచారణకు ఆదేశించారు.
పరారీలో వైసీపీ నేత పీవీపీ.. బెజవాడలో హైదరాబాద్ పోలీసుల గాలింపు.. అంతలోనే సంచలన ట్వీట్లు..
అసలేం జరిగిందంటే..
హత్య, బెదిరింపులు, భూఆక్రమణలు.. తదితర నేరాలకు పాల్పడి, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా రికార్డులకెక్కాడు వివేక్ దుబే. ఇతనిపై 60కిపైగా కేసులు, తలపై రూ.50వేల రివార్డు ఉన్నాయి. కాన్పూర్ జిల్లా చౌబేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తన స్వగ్రామం దిక్రూలో వివేక్ దాక్కున్నట్లు సమాచారం అందడంతో, అతణ్ని అరెస్టు చేసేందుకు శుక్రవారం ఉదయం క్రైమ్ బ్రాంచ్ పోలీసుల బృందం వెళ్లింది. కానీ అప్పటికే మారణాయుధాలతో సిద్ధంగా ఉన్న వివేక్ అనుచరులు.. విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా, ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు, నలుగురు కానిస్టేబుళ్లు చనిపోయారు. ఓ పౌరుడు సహా మరో ఏడుగురు గాయపడ్డారు. కాగా, రైడింగ్ గురించి వికాస్ కు ముందే సమాచారం అందినట్లు నిర్ధారణ అయింది.
ఎస్హెచ్వోపై వేటు.. విచారణ..
కాన్పూర్ ఎన్ కౌంటర్ గా పాపులర్ అయిన ఈ కేసులో చౌబేపూర్ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి వినయ్ తివారీపై సస్పెన్షన్ వేటు పడింది. క్రైమ్ బ్రాంచ్ బృందం దిక్రూ గ్రామానికి వస్తోన్న విషయాన్ని తివారీ ముందుగానే వివేక్ కు తెలియజేశాడని, గతంలోనూ పలు నేరాల్లో గ్యాగ్స్టర్ కు ఈ అధికారి సహకరించినట్లు తెలిసిందని కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ ఆదివారం మీడియాకు తెలిపారు. ఎస్హెచ్వో కాల్ డేటా ఆధారంగా అతనికి క్రిమినల్స్ తో లింకులున్నట్లు తెలుసుకున్నామని, ప్రస్తుతం ఆయనను సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించామని ఐజీ వివరించారు.
వివేక్ ఇంటి కూల్చివేతపై విమర్శలు..
పోలీసులపై కాల్పుల తర్వాత దిక్రూ గ్రామంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం ఎన్ కౌంటర్ చోటుచేసుకోగా, తప్పించుకుని పారిపోయిన నేరస్తుడు వివేక్ దుబే ఇంటిని శనివారం కూల్చివేశారు. ‘‘నేరస్తుణ్ని పట్టుకోలేక.. పోలీసులు వాడి ఇంటిని కూల్చేశారు..''అంటూ పెద్ద ఎత్తున వార్తలు ప్రసారమయ్యాయి. అయితే, ఇంటి కూల్చివేతలో పోలీసుల పాత్రలేదని కాన్పూర్ ఐజీ అగర్వాల్ వివరణ ఇచ్చారు. ఆ స్థలాన్ని వివేక్ బలవంతంగా ఆక్రమించుకుని ఇల్లు కట్టాడని, ఎన్ కౌంటర్ తర్వాత ఆగ్రహించిన గ్రామస్తులే ఆ ఇంటిని కూలగొట్టారని, దీనితో పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
Recommended Video
సీఎం యోగితో ఫొటోలపై దుమారం..
60కిపైగా కేసులు ఎదుర్కొంటున్న వివేక్ దుబే.. ఇటీవల కాన్ఫూర్ కు చెందిన రాహుల్ తివారీ అనే వ్యక్తిపై హత్యాయత్నం చేశాడు. ఈ కేసులోనే అతణ్ని అరెస్టు చేసేందుకు వెళ్లిన క్రమంలో పోలీసులపై కాల్పులు జరిగాయి. గతంలో వివేక్.. బీజేపీ మాజీ మంత్రి సంతోష్ శుక్లాను కూడా హత్య చేసినట్లు కేసు ఉంది. అలాంటి వ్యక్తి.. పొలిటికల్ ఎంట్రీ కోసం కొంతకాలంగా జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. సీఎం యోగి సహా బీజేపీ కీలక నేతలను కలిసి ఫొటోలు కూడా దిగారు. సీఎంతో దుబే ఫొటోల వ్యవహారంపై రాజకీయ దుమారం చెలరేగింది. విపక్ష కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ నేతలు.. అధికార పార్టీపై విమర్శలు చేశారు.