మోడీ జీవితం ప్రేరణ: కపిల్ శర్మ షోలో ప్రధాని?
ముంబై: కలర్స్ టీవీలో అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ షో 'కామెడీ నైట్స్ విత్ కపిల్' వ్యాఖ్యాత కపిల్ శర్మ మరో కొత్త కామెడీ షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'కామెడీ నైట్స్ విత్ కపిల్' అంటూ ఇప్పటి వరకు టీవీ ఛానల్లో బాలీవుడ్ ప్రముఖులు, స్పోర్ట్స్ సెలబ్రిటీలను ఆహ్వానించి ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.
అయితే తన కొత్త షో 'ద కపిల్ శర్మ షో' లో భారత ప్రధాన నరేంద్రమోడీని చూడాలని అనుకుంటున్నాడట. ఈ షోలో ప్రధాని నరేంద్రమోడీ జీవితంలోని ఆదర్శవంతమైన, స్ఫూర్తివంతమైన కోణాన్ని ప్రజలకు పరిచయం చేయనున్నాడు. ఈ కొత్త షో ద్వారా రాజకీయ ప్రముఖులకు, ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
ఇటీవల అమెరికాలోని ఓ టీవీ షోలో (ఎల్లెన్ డేజనెర్స్) అధ్యక్షుడు బరాక్ ఒబామాను చూసిన తర్వాత కపిల్ మనసులో ఈ ఆలోచన వచ్చిందట. ప్రధాని మోడీ జీవితంలోని గొప్పఅంశాలను తనకు చాలా ప్రేరణనిచ్చాయని, ఆయనతో మాట్లాడి, నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు.
అంతేకాదు ఈ షోలో రాజకీయాలు, పార్టీ వ్యవహరాలకు చోటు ఉండదని ముందే చెప్పేశాడు. ఈ షో ద్వారా దేశంలోని రాజకీయ నాయకుల స్ఫూర్తివంతమైన జీవితాన్ని ప్రేక్షకులకు అందించాలన్నదే తన ఉద్దేశమని చెప్పుకొచ్చాడు. గుజరాత్ రాష్ట్రంలోని ఓ గ్రామం నుంచి, దేశ ప్రధాని స్థాయికి ఎదిగిన మోడీ, రాజకీయ ప్రస్థానం ద్వారా ఇతరులకు ప్రేరణ కలిగించాలని కపిల్ తెలిపాడు.
ఏప్రిల్ 23 నుంచి శని, ఆదివారాలలో తొమ్మిది గంటలకి ప్రసారంకానున్నీ ఈ షో ప్రమోషన్ కోసం ఢిల్లీ, లక్నో, భోపాల్, అమృత్సర్ లాంటి ప్రముఖ నగరాలలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కపిల్ శర్మ సిద్ధమయ్యాడు.