Karnataka Polls : ముగిసిన కర్నాటక ఎన్నికల ప్రచారం-ఎల్లుండి 224 సీట్లలో పోలింగ్..
కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగిసింది. సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో నెల రోజులుగా హోరాహోరీగా సాగిన ప్రచారానికి బ్రేక్ పడింది. కర్నాటక అసెంబ్లీలోని మొత్తం 224 సీట్లకు ఎల్లుండి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.
కర్నాటకలో 224 సీట్లకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2163 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. వీరిలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ తో పాటు ఇతర చిన్నపార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులు ఉన్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీ ప్రచారం సాగించారు. ప్రధాన పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోల్ని ప్రకటించాయి. ఇందులో ఓటర్లను ఆకర్షించేందుకు పలు హామీలు ఇచ్చాయి.

కర్నాటకలో ఈసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ వృద్ధులు, దివ్యాంగులను ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశం కల్పించింది. 80 ఏళ్లు దాటిన వృద్ధుల నుంచి ఇప్పటికే ఓట్లను నమోదు చేయించారు. అలాగే దివ్యాంగులు కూడా ఓటు వేశారు. వీరు కాకుండా మిగిలిన ఓటర్లు ఎల్లుండి తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పలు చోట్ల ఈసీ ఈసారి ఎన్నికల్లో పరీక్షిస్తోంది. ఎన్నికల ప్రక్రియను ఆడియో, వీడియో ద్వారా రికార్డు చేయనున్నారు.
కర్నాటకలో ఎల్లుండి జరిగే ఎన్నికల పోలింగ్ తర్వాత ఈ నెల 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. ఇందుకోసం ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ భవిష్యత్తును నిర్దేశించే అవకాశం ఉండటంతో ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. అలాగే భారీ ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రోత్సహిస్తోంది.












Click it and Unblock the Notifications