పొరుగు రాష్ట్రంలో ఎన్నికల హీట్: కోలార్ నుంచి మాజీ సీఎం పోటీ- అక్కడే అసలు ట్విస్ట్..!!
బెంగళూరు: దేశంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలైంది. ఈ ఏడాది ఏకంగా ఎనిమిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు జరుగనుంది. తెలంగాణ సహా కీలక రాష్ట్రాలు ఎన్నికలను ఎదుర్కొనబోతోన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి, ప్రతిపక్ష యూపీఏకు ఇది అత్యంత కీలకమైన సంవత్సరం. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావించే ఈ పోరులో పైచేయి సాధించడానికి కసరత్తు షురూ చేశాయి ఆయా పార్టీలన్నీ.

తెలంగాణ సహా..
కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, త్రిపుర, మేఘాలయాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఏడాది ప్రథమార్థంలో అయిదు, ద్వితీయార్థంలో మూడు రాష్ట్రాలకు ఎన్నికలు షెడ్యూల్ కానున్నాయి. ఫిబ్రవరి-మార్చి నెలల్లో తొలి అయిదింటికీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇది మినీ సార్వత్రిక ఎన్నికలను తలిపిస్తోన్నాయి.

కర్ణాటకలో కీలకం..
పొరుగునే ఉన్న కర్ణాటకలో ఈ ఏడాది మార్చి-ఏప్రిల్లల్లో పోలింగ్ షెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది. మే నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం దాదాపు ఖాయమే. ఎప్పట్లాగే ఈ దఫా కూడా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారథ్యంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) మధ్య ముక్కోణపు పోటీ ఏర్పడుతుందనే అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితి కూడా- ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

కొత్త స్థానాన్ని వెదుక్కున్న సిద్ధు..
ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య- కొత్త నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఏపీ సరిహద్దులకు ఆనుకుని ఉండే కోలార్ నుంచి ఆయన బరిలో దిగనున్నారు. కొద్దిసేపటి కిందట ఆయనే ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తాను కోలార్ నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.

అధిష్ఠానం ఆదేశిస్తే..
కోలార్ స్థానాన్ని ఆయన ప్రకటించారు గానీ అక్కడే ఓ చిన్న మెలిక కూడా పెట్టారు సిద్ధరామయ్య. తాను పోటీ చేయదలచుకున్నప్పటికీ- పార్టీ అధిష్ఠానం దీనికి అంగీకరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కోలార్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ ప్రాంతం నుంచి పోటీ చేయడం వల్ల బీజేపీ ప్రభావాన్ని గణనీయంగా తగ్గించినట్టవుతుందని వ్యాఖ్యానించారాయన. 2018 నాటి ఎన్నికల్లో జేడీఎస్ తో కలిసి తామే అధికారంలోకి వచ్చామని, బీజేపీ అప్రజాస్వామికంగా తమ ప్రభుత్వాన్ని కుప్పకూల్చిందని ధ్వజమెత్తారు.

రెండు చోట్ల పోటీ చేసినా..
2018 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధరామయ్య బాగల్ కోట్ జిల్లాలోని బాదామి స్థానం నుంచి ఘన విజయం సాధించారు. అంతకుముందు ఆయన మైసూర్ లోని వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా నియోజకవర్గాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు కోలార్ నుంచి బరిలో దిగనున్నట్లు ప్రకటించారు. దీనికి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆమోదముద్ర వేయాల్సి ఉంది.












Click it and Unblock the Notifications