నది కాలువలోకి పల్టీ కొట్టిన ప్రైవేటు బస్సు: 20 మంది జలసమాధి, గమ్యం చేరుకునే సమయంలో !
బెంగళూరు: కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కొంత సేపటిలో గమ్యం చేరుకోవలసిన ప్రైవేటు బస్సు ఒక్క సారిగా రోడ్డు పక్కన ఉన్న నది కాలువలోకి పల్టీ కొట్టింది. నది కాలువ నీటిలో మునిగిపోయిన 20 మంది జలసమాధి అయ్యారు.
శనివారం మండ్య జిల్లాలోని పాండవపుర నుంచి మండ్య పట్టణానికి ప్రైవేటు బస్సు బయలుదేరింది. బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని సమాచారం. మార్గం మధ్యలో కనగరమరళి గ్రామం సమీపంలో బస్సు రోడ్డు మీద నుంచి పక్కనే ఉన్న నది కాలువలోకి పల్టీకొట్టింది.
నది కాలువలోని 12 అడుగుల లోతులో బస్సు పడిపోవడంతో ఊపిరి ఆడక 20 మంది జలసమాధి అయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు తాళ్ల సహాయంలో బాధితులను బయటకు లాగడానికి ప్రయత్నించారు. అప్పటికే 20 మంది జలసమాధి అయ్యారు. మృతుల్లో నలుగురు చిన్నారులతో పాటు ఎక్కువ మంది యువకులు ఉన్నారని గ్రామస్తులు తెలిపారు.
విషయం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మండ్య జిల్లా పోలీసు అధికారులు, జిల్లాధికారులకు ఫోన్ చేసి వివరాలు సేకరించారు. రోడ్డుకు, నదికాలువ మధ్య ఎలాంటి గోడ లేకపోవడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. స్థానిక గ్రామస్తులు, అగ్నిమాక సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.