షాక్: ఓటర్లకు డబ్బులు పంచుతూ.. అడ్డంగా దొరికిపోయిన యడ్యూరప్ప, సోషల్ మీడియాలో వీడియో హల్ చల్
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తాజాగా బీజేపీ రాష్ట్ర చీఫ్ బీఎస్ యడ్యూరప్ప ఓటర్లకు డబ్బులు పంచుతూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు.
బెంగళూరు: కర్ణాటకలో రెండు అసెంబ్లీ నియోజక వర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికలను రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు సవాలుగా తీసుకోవడంతో... ఇక్కడ డబ్బు ఏరులై పారుతోంది.
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ ఉప ఎన్నికల్లో ఇలు అధికార కాంగ్రెస్ పార్టీ, అటు ప్రతిపక్ష బీజేపీ ఓటర్లను ప్రలోభానికి గురిచేస్తున్నాయి. ఫలితంగా నంజన్ గూడ, గుండ్లుపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో డబ్బు ఏరులై పారుతోంది.
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తాజాగా బీజేపీ రాష్ట్ర చీఫ్ బీఎస్ యడ్యూరప్ప ఓటర్లకు డబ్బులు పంచుతూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు. చామరాజ్ నగర్ జిల్లాలోని ఓ కుటుంబానికి ఆయన డబ్బులు ఇస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఈ వీడియోపై ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తుండగా, యడ్యూరప్ప మాత్రం తన చర్యను సమర్థించుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు కుటుంబానికి మానవతా దృక్పథంతో ఆర్థిక సాయం చేశానని, ఇంటి పెద్ద అయిన రైతు చనిపోవడంతో ఆ కుటుంబం దీనస్థితిని గమనించి.. పార్టీ ఫండ్ నుంచి వారికి సాయం చేశామని ఆయన పేర్కొన్నారు.
అంతకుముందు కాంగ్రెస్ నాయకులు కూడా ప్రచారంలో డబ్బులతో తిరుగుతున్న వీడియో ఒకటి వెలుగుచూసింది. కర్ణాటక కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు లక్ష్మి హెబల్కర్ రూ. 2వేల నోట్లను చేతిలో పట్టుకొని ప్రచారం నిర్వహిస్తున్న వీడియో దుమారం రేపింది.