కర్ణాటక మంత్రులకు శాఖల కేటాయింపు: ఆయనకే హోం: వారి చేతిలో ఫైనాన్స్, రెవెన్యూ
బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. కొత్తగా 24 మంది శాసన సభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 11:45 నిమిషాలకు బెంగళూరులోని రాజ్భవన్లో ఈ కార్యక్రమం ఆరంభమైంది. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తొలిదశలో వారిద్దరితో పాటు ఎనిమిది- డాక్టర్ జీ పరమేశ్వర, కే హెచ్ మునియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, సతీష్ జార్కిహోలి, ప్రియాంక్ ఖర్గే, రామలింగారెడ్డి, జమీర్ అహ్మద్ ఖాన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారికి శాఖలను ఇంకా కేటాయించలేదు.

ఇవ్వాళ మంత్రివర్గాన్ని విస్తరించారు సిద్ధరామయ్య. కొత్తగా 24 మందిని తన కేబినెట్లోకి తీసుకున్నారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సహా ఇదివరకే ప్రమాణం చేసిన ఎనిమిదిని పరిగణనలోకి తీసుకుంటే మొత్తం మంత్రుల సంఖ్య 34కు చేరినట్టయింది. మంత్రివర్గ విస్తరణలో సిద్ధరామయ్య- డీకే శివకుమార్ వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు.
ప్రమాణ స్వీకారం ముగిసిన కొద్దిసేపటికే వారికి శాఖలను కేటాయించారు. ఈ మేరకు సాధారణ పరిపాలన మంత్రిత్వ శాఖ జీఓ జారీ చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన వద్దే ఉంచుకున్నారు. ఈ శాఖను వేరే వారెవరికీ కేటాయించలేదు. పాలన సంస్కరణలు, సమాచారం, ఇంటెలిజెన్స్ విభాగాలు, ఎవరికీ కేటాయించని శాఖలు.. ముఖ్యమంత్రి ఆధీనంలోనే ఉంటాయి.
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు భారీ, మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టుల శాఖను కేటాయించారు. కొత్తగా బెంగళూరు నగరాభివృద్ధి కోసం మరో శాఖను సృష్టించారు. దీన్ని కూడా డీకే శివకుమార్ పర్యవేక్షిస్తారు. మంత్రివర్గంలో నంబర్ 2గా భావించే హోం మంత్రిత్వ శాఖను డాక్టర్ జీ పరమేశ్వరకు అప్పగించారు. ఇంటెలిజెన్స్ విభాగాన్ని మాత్రం సిద్ధరామయ్యే పర్యవేక్షిస్తారు.

హెచ్ కే పాటిల్- న్యాయం, శాసన సభ వ్యవహారాలు, చిన్న నీటిపారుదల శాఖ, కేహెచ్ మునియప్ప- ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, కేజే జార్జ్- విద్యుత్, ఎంబీ పాటిల్- భారీ, మధ్య తరహా పరిశ్రమలు, ఐటీ అండ్ బీటీ, రామలింగారెడ్డి- రవాణా, సతీష్ జార్కిహోలి- పబ్లిక్ వర్క్స్ శాఖలను కేటాయించారు.
ప్రియాంక్ ఖర్గే- గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, జమీర్ అహ్మద్ ఖాన్- గృహ నిర్మాణం, వక్ఫ్, మైనారిటీ వ్యవహారాలు, కృష్ణ బైరెగౌడ- రెవెన్యూ (దేవాదాయం మినహా), దినేష్ గుండూరావు- ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఎన్ చలువరాయస్వామి- వ్యవసాయం, కే వెంకటేష్- పశుసంవర్ధకం, సెరికల్చర్, హెచ్సీ మహదేవప్ప- సాంఘిక సంక్షేమం, ఈశ్వర్ ఖండ్రే- అటవీ, పర్యావరణం, కేఎన్ రాజన్న- సహకార శాఖలను ఇచ్చారు.
శరణబసప్ప దర్శనాపుర- చిన్న తరహా పరిశ్రమల, పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్, శివానంద పాటిల్- టెక్స్టైల్స్, చక్కెర, మార్కెటింగ్, ఆర్బీ తిమ్మాపూర్- ఎక్సైజ్, దేవాదాయం, ఎస్ఎస్ మల్లికార్జున- గనులు, హార్టికల్చర్, శివరాజ్ తంగడగి- బీసీ, ఎస్టీ సంక్షేమం, శరణ ప్రకాష్ పాటిల్- ఉన్నత విద్య, మంకాల్ వైద్య- మత్స్యాభివృద్ధి, పోర్టులు, లక్ష్మీ హెబ్బాళ్కర్- మహిళా, శిశు సంక్షేమ శాఖలను కేటాయించారు.
రహీంఖాన్- మున్సిపల్ పరిపాలన, హజ్, డీ సుధాకర్- మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్లానింగ్, సంతోష్ లాడ్- కార్మిక, నైపుణ్యాభివృద్ధి, ఎన్ ఎస్ బోస్ రాజు- పర్యాటకం, శాస్త్ర- సాకేంతికం, బైరతి సురేష్- పట్టాభివృద్ధి, టౌన్ ప్లానింగ్ (బీబీఎంపీ మినహా), మధు బంగారప్ప- ప్రాథమిక, సెకెండరీ విద్య, డాక్టర్ ఎంసీ సుధాకర్- వైద్య విద్య, బీ నాగేంద్ర- యువజన వ్యవహారాలు, క్రీడలు, సాంస్కృతిక శాఖలను కేటాయించారు.












Click it and Unblock the Notifications