క్యాబినెట్ పునర్వ్యస్థీకరణ: అంబరీష్కు ఉద్వాసన
బెంగుళూరు: రెండు సంత్సరాలలోపే కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండటంతో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భారీ స్థాయిలో తన మంత్రివర్గాన్ని విస్తరించారు. మొత్తం 14 మంది మంత్రులకు ఉద్వాసన పలికిన సిద్ధరామయ్య కొత్తగా తన మంత్రి వర్గంలోకి 13 మందికి చోటు కల్పించారు.
కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించడంతో వీరిలో తొమ్మిది మందికి క్యాబినెట్ హోదా, నలుగురికి సహాయ మంత్రి హోదా కల్పించారు. ఆదివారం రాజ్భవన్లో గవర్నర్ వాజుభాయి వాలా వీరితో ప్రమాణం చేయించారు. అంతక ముందు 14 మంది మంత్రులను తొలగించాలని సీఎం చేసిన సిఫారసును గవర్నర్ ఆమోదించారు.
కాగా, క్యాబినెట్ మంత్రులుగా తన్వీర్సయీట్, కగొడు తిమ్మప్ప, రమేశ్కుమార్, బసవరాజ్రాయారెడ్డి, హెచ్వై మెటి, ఎస్ఎస్ మల్లికార్జున్, ఎంఆర్ సీతారాం, సంతోష్లాడ్, రమేశ్జార్కిహోలి, సహాయ మంత్రులుగా ప్రియాంక్ఖర్గె, రుద్రప్ప లమానీ, ఈశ్వర్ఖాండ్రే, ప్రమోద్మధ్వరాజ్ ప్రమాణంచేశారు.
కడొగు తిమ్మప్ప, రమేశ్కుమార్ ఇంతకుముందు అసెంబ్లీ స్పీకర్లుగా పనిచేయగా, సహాయమంత్రిగా ప్రమాణంచేసిన ప్రియాంక్ఖర్గే.. లోక్సభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత మల్లికార్జునఖర్గే తనయుడు కావడం విశేషం. ఇదిలా ఉంటే మంత్రి పదవులు కోల్పోయిన వారిలో సినీ నటుడు అంబరీశ్తో పాటు పీటీ పరమేశ్వర్నాయక్, ఖ్వామారుల్ఇస్లాం, షామనూర్శివశంకరప్ప, వీ శ్రీనివాస ప్రసాద్, వినయ్కుమార్ సొరాకె, సతీశ్జర్కిహోలి, బాబూరావు చించాంసూర్, శివరాజ్సంగప్ప తంగడగి, ఎస్ఆర్ పాటిల్, మనోహర్ తహసీల్దార్, కే అభయచంద్రజైన్, దినేశ్గుండూరావు, కిమ్మనె రత్నాకర్ ఉన్నారు.
తాజా పునర్వ్యవస్థీకరణతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య క్యాబినెట్ సభ్యుల సంఖ్య 33మందికి చేరింది. ఇటీవల జరిగిన అసోం, కేరళ రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో ఆయన క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు చేపట్టారు. కాగా 2013 మే 13న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
Being non-corrupt , straight forward & honest might not win todays battle...but time will prove the ultimate winner in any war
— sumalatha ambareesh (@sumalathaA) June 19, 2016
ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రి వర్గ మార్పులను కన్నడిగులు తప్పుబడుతున్నారు. ముఖ్యంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పదవిని కోల్పోయిన గృహనిర్మాణశాఖ మంత్రి అంబరీశ్ అభిమానులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
మరోవైపు మాజీ మంత్రి అంబరీశ్కు కన్నడ సినీ పరిశ్రమ మద్దతుగా నిలిచింది. బీజేపీ నాయకుడు, శాండిల్వుడ్కే చెందిన హాస్యనటుడు జగ్గేష్... అంబరీశ్ను మంత్రి పదవి నుంచి తప్పించడాన్ని కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక తప్పిదంగా పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
'రాజకీయనాయకులకు పదవులు ఉన్నప్పుడే గౌరవం ఉంటుంది. మంత్రిగా ఐదేళ్లు పని చేసి దిగిపోయిన తర్వాత ఎవరూ గౌరవించరు. అయితే అంబరీష్ రాజకీయ నాయకుడి కంటే కన్నడ నటుడిగా రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఆయన చిన్న పిల్లాడి మన స్థత్వం కలిగిన వారు. ఎటువంటి తప్పులు చేయలేదు. అయినా మంత్రి పదవి నుంచి తొలగించారు. ఇది చారిత్రాత్మక తప్పిందం. దీని వల్ల కన్నడిగుల ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ లోనైంది. అందులోనూ ఒక మహిళ చెప్పిన మాటలు విని మంత్రిగా ఆయన్ను తప్పించడం సరి కాదు' అని పేర్కొన్నారు.