ప్రభుత్వ బంగ్లాలు వద్దు: ఇప్పుడు కారు వద్దంటున్న సీఎం కుమారస్వామి, సెంటిమెంట్, అదృష్టం !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర జేడీఎస్ అధ్యక్షుడు హెచ్.డి.కుమారస్వమి ట్వీస్ట్ మీద ట్వీస్ట్ ఇస్తున్నారు. తాను ప్రభుత్వ బంగ్లాలు అనుగ్రహ, కావేరీలో నివాసం ఉండనని, జేపీ నగర్ లోని మినీ ఫారెస్టు రోడ్డులోని సొంత ఇంటిలో నివాసం ఉంటానని ఇప్పటికే తేల్చి చెప్పారు. ఇప్పుడు తాజాగా తనకు ప్రభుత్వం ఇచ్చే కారు వద్దని అధికారులకు షాక్ ఇచ్చారు. కుమారస్వామి కొన్ని సెంటిమెంట్లను అదృష్టంగా భావిస్తున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు.
రేంజ్ రోవర్ కారు
కర్ణాటక శాసన సభ ఎన్నికల ప్రచారం చెయ్యడానికి వెళ్లిన సమయంలో హెచ్.డి. కుమారస్వామి రేంజ్ రోవర్ కారును కొన్నిసార్లు ఉపయోగించారు. తరువాత ఎన్నిక ప్రచారం కోసం ప్రత్యేకం తయారు చేసిన ఏసీ బస్సును ఉపయోగించుకున్నారు.
ఎన్నికల ఫలితాలు
మే 15వ తేదీన కర్ణాటక శాసన సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఆ రోజు హెచ్.డి. కుమారస్వామి రేంజ్ రోవర్ కారులోనే సంచరించారు. తరువాత కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించారు అప్పటి నుంచి రేంజ్ రోవర్ కారులోనే హెచ్.డి. కుమారస్వామి సంచరిస్తున్నారు.
సీఎం, బలపరీక్ష
కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యడానికి వచ్చిన సమయంలో, బలపరీక్ష నిరూపించుకోవడానికి శుక్రవారం విధాన సౌధకు వచ్చిన సమయంలో రేంజ్ రోవర్ కారునే ఉపయోగించారు. సీఎం కావడం, బలపరీక్షలో విజయం సాధించడంతో రేంజ్ రోవర్ అదృష్టం కారు అనే సెంటిమెంట్ తో కొంతకాలం దానినే ఉపయోగించాలని కుమారస్వామి నిర్ణయించారని ఆయన సన్నిహితులు అంటున్నారు.
యడ్యూరప్ప కారు
పరిపాలన, సిబ్బంది వ్యవహారాల శాఖ అధికారులు కొత్తగా సీఎం, మంత్రులు అయిన సమయంలో కొత్తకార్లు కొనుగోలు చేసి ఇవ్వడం ఆనవాయితి. మూడు రోజులు ముఖ్యమంత్రి అయిన బీఎస్. యడ్యూరప్ప రెండు రోజుల పాటు హుండై కారులో సంచరించారు.
టొయోట ఫార్చూనర్
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కోసం ప్రభుత్వ అధికారులు టొయోటా ఫార్చూనర్ కారు కొనుగోలు చేశారు. సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం ఇచ్చిన టొయోటా ఫార్చూనర్ కారులోనే సంచరించారు.
కారు అదృష్టం
తనకు అదృష్టంగా ఉన్న రేంజ్ రోవర్ కారులోనే సంచరించాలని సీఎం కుమారస్వామి అంటున్నారని సమాచారం. మంత్రి వర్గ విస్తరణకు ఎలాంటి ఆటంకాలు రాకపోతే తరువాత కుమారస్వామి ప్రభుత్వ కారును ఉపయోగించే అవకాశం ఉందని అంటున్నారు జేడీఎస్ నేతలు.