సిద్ధరామయ్య రాజీనామా ముహూర్తం ఖరార్: ఆ వెంటనే.. !!
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఆయన స్థానంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని మంత్రి హెచ్కే పాటిల్ గురువారం ధృవీకరించారు. నిజానికి ఈ ఉదయమే సిద్ధరామయ్య తన రాజీనామా పత్రాన్ని సమర్పించాల్సి ఉన్నప్పటికీ.. కొంత అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ ఉదయం బెంగళూరులో సిద్ధరామయ్య అధికారిక నివాసం 'కావేరి'లో జరిగిన అల్పాహార సమావేశం అనంతరం హెచ్కే పాటిల్ విలేకరులతో మాట్లాడారు. సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేయబోతోన్నారని వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం 3- 3:30 గంటలకు రాజీనామా చేస్తారని వెల్లడించారు. డీకే శివకుమార్ను కొత్త సీఎంగా చేస్తామని సీఎం సిద్ధరామయ్య స్వయంగా తెలిపారని పేర్కొన్నారు. డీకే తదుపరి ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు.

రాజీనామా పత్రాన్ని లోక్ భవన్ లో సమర్పించిన వెంటనే సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ అధిష్ఠానాన్ని కలుసుకోనున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్ ఛార్జీ రణ్ దీప్ సుర్జేవాలాతో భేటీ కానున్నారు. ఈ భేటీ ఎందుకనేది స్పష్టంగా తెలియరావట్లేదు.
మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న తరుణంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అల్పాహార సమావేశం సందర్భంగా డీకే శివకుమార్.. సిద్ధరామయ్య పాదాలకు నమస్కరించడం కనిపించింది. ఇది నాయకత్వ మార్పిడికి అద్దం పట్టింది. ఈ ఇద్దరు నేతలు కూడా ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
ప్రియాంక్ ఖర్గే, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, రామలింగ రెడ్డి, హెచ్కే పాటిల్ సహా పలువురు సీనియర్ కర్ణాటక మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశ ప్రదేశం వెలుపల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా డీకే శివకుమార్ సోదరుడు, మాజీ ఎంపీ డీకే సురేష్ బెంగళూరులోని శివకుమార్ నివాసానికి చేరుకున్నారు. బయట మద్దతుదారులు సంబరాలు చేసుకుంటూ, రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి.
శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రి కావడం ఖాయమైన నేపథ్యంలో ఆయన మద్దతుదారులు బెంగళూరులోని ఆయన నివాసం బయట స్వీట్లు పంచి పెట్టారు. సంబరాలు చేసుకున్నారు. కలబురగిలో ఇండియన్ యూత్ కాంగ్రెస్ సభ్యులు శ్రీ శరణ బసవేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీకే శివకుమార్ కేబినెట్ లో మంత్రి ప్రియాంక్ ఖర్గేను ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని కోరుకున్నారు.












Click it and Unblock the Notifications