కర్ణాటక సీఎం చేతిలో 11 కీలక శాఖలు, మంత్రులకు శాఖలు పంపిణి, నిర్ణయం, అసమ్మతి దెబ్బ!
బెంగళూరు: కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రులకు శాఖల కేటాయించారు. అసమ్మతి ఎమ్మెల్యేల తిరుగుబాటు చేసిన సమయంలోనే ముఖ్యమంత్రి కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్ మంత్రులకు శాఖలు కేటాయించారు.
గవర్నర్ గ్రీన్ సిగ్నల్
కొత్తగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారికి కేటాయించిన శాఖల జాబితాను శుక్రవారం కర్ణాటక గవర్నర్ వాజుబాయ్ వాలాకు పంపించి ఆమోదం పొందారు. మంత్రి వర్గంలో ముఖ్యంగా ఒక్కలిగ (గౌడ) వర్గానికి కీలక శాఖలు ఇచ్చారు.
14 జిల్లాలకు షాక్
హైదరాబాద్ కర్ణాటకలోని మూడు జిల్లాలతో పాటు కర్ణాటకలోని 14 జిల్లాలకు ఒక్క మంత్రి పదవి దక్కలేదు. పాత మైసూరు ప్రాంతానికి చెందిన అధిక మందికి మంత్రి పదవులు పంపిణి అయ్యాయి. ఇక బెంగళూరుకు మూడు మంత్రి పదవులు దక్కాయి.
సీఎంకు 11 శాఖలు
జేడీఎస్ కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హెచ్.డి. కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవితో పాటు 11 కీలక శాఖలు సొంతం అయ్యాయి. ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్, ఎక్సైజ్, చేనేత, డీపీఎఆర్, మూలభూత సౌకర్యాలు, ఇన్ఫర్మేషన్ డిపార్ట్ మెంట్, ప్రజా ప్రయోజనాల శాఖతో సహ మొత్తం 11 శాఖలు కుమారస్వామి చేతికి వెళ్లాయి.
డీసీఎం, డీకే శాఖలు
ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్ చేతికి హోం శాఖ, ఇంటెలిజెన్స్, క్రీడలు, యువజన సంక్షేమం, బెంగళూరు అభివృద్ది శాఖలు వెళ్లాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డీకే. శివకుమార్ కు భారీ, మధ్య తరహా నీటిపారుదల శాఖ, వైద్య శిక్షణా, కుటుంబ సంక్షేమ శాఖలు కేటాయించారు.
శివశంకర్ రెడ్డి
తెలుగు మూలాలు ఉన్న గౌరిబిదనూరు ఎమ్మెల్యే శివశంకర్ రెడ్డికి వ్యవసాయ శాఖ అప్పగించారు. ఆర్ వీ దేశ్ పాండేకి రెవన్యూ శాఖ, కేజే జార్జ్ కు ఐటీ-బీటీతో పాటు భారీ పరిశ్రమలు, చక్కర, సాంకేతిక పరిశోదనా శాఖలు అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ మరో సీనియర్ నేత, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు కృష్ణభైరే గౌడకు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది, శాసన సభ పరిపాలనా విభాగం, న్యాయ శాఖలు అప్పగించారు.
మంత్రుల శాఖలు
సీఎం సోదరుడు హెచ్.డి రేవణ్ణకు బందరు ఖాత మినహా ప్రజాపనుల శాఖ (పీడబ్లుడీ), ప్రియాంకా ఖార్గేకి సాంఘిక సంక్షేమ శాఖ, యూటీ. ఖాదర్ కు నగరాభివృద్ది శాఖ (బీబీఎంపీ లేదు), జమీర్ అహమ్మద్ కు ఆహార పౌర సరఫరాలు, మైనారి సంక్షేమం, వక్స్ బోర్డు, శివానంద పాటిల్ కు ఆరోగ్య, కుటుంబ సక్షేమ శాఖ, రాజశేఖర్ పాటిల్ కు గనులు, భూగర్బ జలాలు, దేవాదాయ శాఖలు, ఆర్. శంకర్ కు పరిసర ప్రాంతాలు, అటవి శాఖ, పుట్టరంగే శెట్టికి వెనుక బడిన వర్గాల అభివృద్ది శాఖ, వెంకటరమణప్పకు కార్మిక శాఖ, బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్. మహేష్ కు ప్రాథమిక విద్యా శాఖ, సా.రా. మహేష్ కు పట్టు పరిశ్రమలు, పర్యాటక శాఖలు, వెంకటరావ్ నాడగౌడకు చేపలపెంపకం, పశు పరిశోధన శాఖ, గుబ్బి శ్రీనివాస్ కు చిన్ననీటి పారుదల శాఖ, ఎంసి. మనగోలికి తోటల పెంపకం శాఖ, జీటీ దేవేగౌడకు ఉన్నత విద్యా శాఖ, బండప్ప కాశాపురకు సహకార శాఖలు అప్పగించారు.