ఫ్రీ వ్యాక్సిన్ లిస్ట్లో మన పొరుగు రాష్ట్రం: 28 నుంచి రిజిస్ట్రేషన్: పేరు నమోదు చేసుకుంటేనే..!
బెంగళూరు: ప్రాణాంతక కరనా వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం మూడో దశ ఇంకొద్ది రోజుల్లో అమలు కానుంది. ప్రస్తుతం ఈ వ్యాక్సినేషన్ రెండోదశ కార్యక్రమం కొనసాగుతోంది. 45 సంవత్సారలకు పైనున్న వయస్సు గల వారికి వ్యాక్సిన్ వేస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. మే 1వ తేదీ నుంచి మూడోదశ అమల్లోకి రాబోతోంది. 18 సంవత్సరాలు పైనున్న ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవడానికి అర్హులుగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
Recommended Video
కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లోనూ ఒకేసారి అమల్లోకి రాబోతోంది. ఏపీ, తెలంగాణ సహా ఇప్పటికే అనేక రాష్ట్రాలు అర్హులందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించాయి. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇదే ప్రకటన చేసింది ఈ ఉదయమే. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కేరళ, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ తమ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ వేయనున్నట్లు వెల్లడించాయి. తాజాగా ఇదే జాబితాలోకి కర్ణాటక కూడా చేరింది.
కర్ణాటకలో అర్హులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేస్తామని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ వేయించుకునే వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపారు. దీనికి అవసరమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభిస్తామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు కోవిడ్ పోర్టల్, కోవిన్లో తమ పేరు, వయస్సు, ఇతర వివరాలను నమోదు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
వ్యాక్సిన్ను కొనుగోలు చేయడానికి తొలిదశలో 400 కోట్ల రూపాయలను కేటాయించామని అన్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను మంత్రివర్గ సమావేశంలో ఆమోదించినట్లు పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన సూచనలకు అనుగుణంగా వ్యాక్సిన్ను అనేక రాష్ట్రాలు ఉచితంగా అందిస్తున్నాయని, తాము కూడా ఆ కార్యక్రమాన్ని చేపడుతామని చెప్పారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి లాక్డౌన్ విధించామని, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.