కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లేడీ ఎమ్మెల్యే ఫేస్ బుక్ పోస్టు వైరల్, ఫిబ్రవరి 14 కాదు, డేట్ ఫిక్స్: మరుజన్మ
బెంగళూరు: కర్ణాటకలోని బెళగావి గ్రామీణ శాసన సభ నియోజక వర్గం కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే లక్ష్మి హెబ్బాళ్కర్ ఆమె ఫేస్ బుక్ లో పోస్టు చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఫిబ్రవరి 14వ తేదీ తాను పుట్టినరోజు జరుపుకోలేదని, తాను బెళగావి గ్రామీణ నియోజక వర్గం ప్రజల ఆడబిడ్డను అంటూ ఓ వీడియో ఫేస్ బుక్ లో అప్ లోడ్ చెయ్యడంతో అదికాస్తా వైరల్ అయ్యింది.
మే 12న ముహుర్తం ఫిక్స్
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లేడీ ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మి హెబ్బాళ్కర్ పుట్టినరోజు ఫిబ్రవరి 14వ తేదీ. ప్రతి సంవత్సరం లక్ష్మి హెబ్బాళ్కర్ అభిమానులు ఫిబ్రవరి 14వ తేదీ ఆమె పుట్టినరోజు వేడుకలు నిర్వహించి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే తన పుట్టిన రోజు వేడుకలు మే 12వ తేదీ ప్రజల మధ్య జరుపుకోవాలని ఎమ్మెల్యే లక్ష్మి హెబ్బాళ్కర్ నిర్ణయించారు.
రాజకీయ జన్మ ఇచ్చారు
తాను పుట్టింది ఫిబ్రవరి 14 అయినా తనకు ప్రజలు రాజకీయ జన్మనిశ్చింది 2018 మే 12వ తేది అంటూ లక్ష్మి హెబ్బాళ్కర్ ఫేస్ బుక్ లో వివరించారు. మే 12వ తేదీ తాను మొదటిసారి ఎమ్మెల్యే అయ్యానని, తన నియోజక వర్గం ప్రజలు భారీ మెజారిటీతో తనను గెలిపించారని, అదే రోజు వారితో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటానని ఎమ్మెల్యే లక్ష్మి హెబ్బాళ్కర్ ఫేస్ బుక్ లో వివరించారు. 2018లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బెళగావి గ్రామీణ నియోజ వర్గం నుంచి పోటీ చేసిన లక్ష్మి హెబ్బాళ్కర్ 1, 02, 040 ఓట్లతో ఎమ్మెల్యే అయ్యి మొదటిసారి శాసన సభలో అడుగుపెట్టారు.
వైరల్ వీడియో
కర్ణాటక రాజకీయాలు ఓఎత్తు అయితే బెళగావి జిల్లా రాజకీయాలు మరోఎత్తు. మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకుని ఉన్న బెళగావి జిల్లా రాజకీయాలు ఎప్పుడు వాడివేడిగా ఉంటాయి. బెళగావి జిల్లాలో మంచి పట్టు ఉన్న రాజకీయ నాయకురాలిగా లక్ష్మి హెబ్బాళ్కర్ కు మంచి గుర్తింపు ఉంది. పుట్టిరోజు వేడుకల విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయం చర్చకు దారితీస్తే, ఫేసుబక్ లో ఆమె అప్ లోడ్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.
వివాదాల లక్ష్మి హెబ్బాళ్కర్ !
కాంగ్రెస్ పార్టీ కర్ణాటక మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేసిన లక్ష్మి హెబ్బాళ్కర్ అనేకసార్లు వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచారు. 2013లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో, 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన లక్ష్మి హెబ్బాళ్కర్ ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మి హెబ్బాళ్కర్ ఇటీవల జరిగిన బెళగావి పీఎల్ డీ బ్యాంకు ఎన్నికల్లో సొంత పార్టీ మంత్రికి వ్యతిరేకంగా తన అభ్యర్థులను పోటీచేయించి గెలిపించుకుని వార్తల్లో నిలిచారు.