అక్రమ మైనింగ్: కోర్టులో అసమ్మతి ఎమ్మెల్యేలు, ఆపరేషన్ కమల, గాలి జనార్దన్ రెడ్డి మిస్!
బెంగళూరు: ఆపరేషన్ కమల హైడ్రామాలో భాగంగా కొంత కాలంగా మాయం అయిన బళ్లారి గ్రామీణ నియోజక వర్గం ఎమ్మెల్యే బి. నాగేంద్ర గురువారం ప్రత్యక్షం అయ్యారు. కర్ణాటకలోని బెళెకెరి ఇనుప ఖనిజం అక్రమంగా తరలించారని నమోదు అయిన కేసులో బి. నాగేంద్ర గురువారం బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో హాజరైనారు. ఈ కేసులో మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి గురువారం విచారణకు హాజరుకాలేదు.
బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే బి. నాగేంద్రతో పాటు మరో ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనంద్ సింగ్ ప్రత్యేక కోర్టు ముందు హాజరైనారు. బెళెకెరి ఇనుప ఖనిజం అక్రమంగా తరలించారని నమోదు అయిన కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కోర్టు విచారణకు హాజరుకాలేదు.
గాలి జనార్దన్ రెడ్డి శిష్యుడు
గాలి జనార్దన్ రెడ్డి సన్నిహితుడు ఆలీఖాన్ కోర్టు విచారణకు హాజరైనారు. ఈ కేసు విచారణ శుక్రవారం (జనవరి 18) కూడా జరుగుతుందని, అందు వలన కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల సమావేశానికి హాజరుకావడం సాధ్యం కాదని ఎమ్మెల్యే బి. నాగేంద్ర మీడియాకు చెప్పారు.
సిద్దరామయ్య వార్నింగ్
కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల సమావేశానికి ఎమ్మెల్యేలు అందరూ హాజరుకావాలని, లేదంటే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని, పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తామని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
వారెంట్లు జారీ
బెళెకెరి ఇనుప ఖనిజం అక్రమ రవాణాపై నమోదు అయిన కేసులో జరుగుతున్న విచారణ వాయిదాలకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బి. నాగేంద్ర, ఆనంద్ సింగ్ హాజరుకాలేదు. ఎమ్మెల్యేలు నాగేంద్ర, ఆనంద్ సింగ్ పై న్యాయస్థానం నాన్ బెయిల్ బుల్ వారెంట్లు జారీ చేసింది.
పిటిషన్ తిరస్కరణ
నాన్ బెయిల్ బుల్ వారెంట్లు జారీ కావడంతో గురువారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, నాగేంద్ర కోర్టులో హాజరైనారు. కోర్టు విచారణకు తాను హాజరుకాలేనని, వచ్చే వాయిదాకు హాజరౌతానని మాజీ మంత్రి ఆనంద్ సింగ్ సమర్పించిన అర్జీని న్యాయమూర్తి బివి. పాటిల్ తిరస్కరించడంతో ఆయన కోర్టు ముందు హాజరైనారు.
సీబీఐ, ఎస్ఐటీ విచారణ
మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ కు చెందిన వైష్ణవి మినరల్స్ కంపెనీ 2009లో అక్రమంగా బెళెకెరి నుంచి చైనా, సింగపూర్ కు ఇనుప ఖనిజం తరలించారని కేసు నమోదు అయ్యింది. ఈ కేసును సీబీఐ, ఎస్ఐటీ అధికారులు విచారణ చేసి కోర్టులో చార్జిషీటు సమర్పించారు. ఇదే కేసులో మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.