బీజేపీలోకి రావాలని మంత్రి మీద సీబీఐ, ఐటీ, ఈడీ ఒత్తిడి, మోడీని కలుస్తా, కాంగ్రెస్ ఎంపీ !
బెంగళూరు: బీజేపీలో చేరాలని తన సోదరుడు, కర్ణాటక మంత్రి డీకే. శివకుమార్ మీద ఆ పార్టీ నాయకులు కుట్రపన్నుతున్నారని బెంగళూరు గ్రామీణ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ డీకే. సురేష్ ఆరోపించారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీని కలిసి స్వయంగా ఫిర్యాదు చేస్తానని డీకే. సురేష్ అన్నారు.
కాంగ్రెస్ VSకాంగ్రెస్, వేడెక్కిన రాజకీయం, బళ్లారి శ్రీరాములు ఎంట్రీ, ఢిల్లీకి మాజీ సీఎం!
శనివారం బెంగళూరులోని సదాశివనగర్ లోని ఇంటిలో డీకే. సురేష్ మీడియాతో మాట్లాడారు. డీకే. శివకుమార్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ రప్పించుకోవడానికి ఆ పార్టీ నాయకులు అధికారాన్ని దుర్వనియోగం చేస్తున్నారని డీకే. సురేష్ ఆరోపించారు.
9 సార్లు దాడులు
గత ఏడాది నుంచి మమ్మల్ని (డీకే. శివకుమార్, డీకే. సురేష్) టార్గెట్ చేసుకుని 9 సార్లు ఐటీ అధికారులు దాడులు చేశారని డీకే. సురేష్ ఆరోపించారు. తాము చట్టాన్ని ఉల్లంఘించకపోయినా సీబీఐ, ఆదాయపన్ను శాఖ అధికారులు విచారణను ఈడీకి అప్పగించారని డీకే. సురేష్ ఆరోపించారు.
బీజేపీ సంస్థలు
కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ, ఆదాయపన్ను శాఖ బీజేపీ అనుబంధ సంస్థలుగా పని చేస్తున్నాయని, స్వతంత్రగా అవి పని చెయ్యడంలేదని కాంగ్రెస్ ఎంపీ డీకే. సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక నెలలో డీకే. శివకుమార్ అరెస్టు అవుతారని బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని డీకే. సురేష్ ఆరోపించారు.
కేసులు మాఫీ చేస్తాం
మంత్రి డీకే. శివకుమార్ తో సహ 7 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేరాలని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒత్తిడి చేస్తున్నాయని, అందుకు ప్రతిఫలంగా కేసు మాఫీ చేస్తామని హామీలు ఇస్తున్నారని, సరైన సమయంలో వాటి ఆధారాలను మీడియా ముందు విడుదల చేస్తానని కాంగ్రెస్ ఎంపీ డీకే. సురేష్ అన్నారు.
మోడీకి ఫిర్యాదు చేస్తా
తాము చట్టాలను ఉల్లంఘించపోయినా మమ్మల్ని సీబీఐ, ఐటీ శాఖ, ఈడీ టార్గెట్ చేశాయని డీకే. సురేష్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ భేటీకి అనుమతి కోరానని, ఆయన్ను కలిసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న సీబీఐ, ఐటీ శాఖ, ఈడీ మీద ఫిర్యాదు చేస్తానని డీకే. సురేష్ అన్నారు.
న్యాయపోరాటం
మమ్మల్ని అరెస్టు చెయ్యడానికి ఈడీ అధికారులు బెంగళూరు వచ్చారని సమాచారం వచ్చిందని, అరెస్టు చేస్తే మేము న్యాయపోరాటం చెయ్యడానికి సిద్దంగా ఉన్నామని డీకే. సురేష్ చెప్పారు. ఇప్పటికే అధికారుల విచారణకు సహకరించామని, అయినా మమ్మల్ని బీజేపీ నాయకులు టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ డీకే. సురేష్ ఆరోపించారు.