కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్స్: రెబల్ స్టార్, రమ్యా పేర్లు మాయం, రాహుల్ గాంధీ డుమ్మా!
బెంగళూరు: కర్ణాటకలో జరుగుతున్న లోక్ సభ, శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్స్ జాబితాను విడుదల చేసింది. ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చీఫ్ రమ్యా అలియాస్ దివ్యా స్పందన, రెబల్ స్టార్ పేర్లు స్టార్ క్యాంపైనర్స్ జాబితాలో లేకపోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు షాక్ కు గురైనారు.
గతంలో మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన రమ్యా ఎంపీగా విజయం సాధించారు. తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రమ్యా ఓటమిపాలైనారు. అప్పటి నుంచి రమ్యా మండ్య ప్రజలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత రమ్యా ఢిల్లీకే పరిమితం అయ్యారు.
రాహుల్ గాంధీ డుమ్మా
నవంబర్ 3వ తేదీన కర్ణాటకలోని బళ్లారి, మండ్య, శివమొగ్గ లోక్ సభ నియోజక వర్గాలు, రామనగర, జమఖండి శాసన సభ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరుకావడం లేదని ఆపార్టీ నాయకులు అంటున్నారు.
మీరే చూసుకోండి
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆ పార్టీ సీనియర్ నాయకులకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్ ఖార్గే, కేసీ. మునియప్ప, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్, సీఎం. ఇబ్రహీం, దినేష్ గుండూరావ్ తో సహా మిగిలిన నాయకులు ఎన్నికల ప్రచారం చెయ్యనున్నారు.
మంత్రులతో ప్రత్యేక కమిటీ
కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు కలిసి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వంలోని మంత్రులు డీకే. శివకుమార్, ఆర్ వీ. దేశ్ పాండే, డాక్టర్ జయమాల, రమేష్ జారకిహోళి, రాజశేఖర్ పాటిల్, శివానంద్ పాటిల్, యూటీ. ఖాదర్, వెంకటరమణప్ప తదితరులు స్టార్ క్యాంపైనర్స్ జాబితాలో ఉన్నారు.
రెబల్ స్టార్, రమ్యా
మండ్య లోక్ సభ నియోజక వర్గంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే మండ్య నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేసిన రెబల్ స్టార్ అంబరీష్, మండ్య మాజీ ఎంపీ రమ్యా సైతం ఆ నియోజక వర్గంలో ప్రచారం చెయ్యడం లేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి.
హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్
మండ్య లోక్ సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి రమ్యాకు అవకాశం ఇవ్వాలని, లేదంటే తనకు అవకాశం ఇవ్వాలని ఆమె తల్లి రంజితా డిమాండ్ చేశారు. అయితే రమ్యా, ఆమె తల్లి రంజితా పోటీ చేస్తే కచ్చితంగా ఓడిస్తామని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హెచ్చరించారు. కార్యకర్తల హెచ్చరికలతో అధిష్టానం వారిద్దరిని పక్కన పెట్టింది.