నేడే కర్ణాటక ఎన్నికల ఫలితాలు: ఉదయం 8గం. నుంచి ఓట్ల లెక్కింపు!
బెంగళూరు: దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న కన్నడ సంగ్రామంలో విజేత ఎవరో నేడే తేలనుంది. ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ ఎన్నికల ఫలితాలు 'హంగ్'కి అవకాశం ఇస్తాయా?.. లేక కాంగ్రెస్, బీజేపీలలో ఏదేని ఒక పార్టీకి ఓటర్లు పూర్తి మెజారిటీని కట్టబెట్టారా? అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.
కర్ణాటకలోని 222 అసెంబ్లీ స్థానాలకు మే 12న ఎన్నికలు జరగ్గా.. నేడు ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ మేరకు ఉదయం 8గం. నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మధ్యాహ్నాం 12గం. వరకు విజేత ఎవరన్నది తేలిపోనుంది. కాగా, ఓట్ల లెక్కింపు కోసం 38 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

కౌంటింగ్ జరిగే 38కేంద్రాల వద్ద వేడుకలు, ఊరేగింపులు, బాణసంచాలను పోలీసులు నిషేధించారు. ఎస్పీ స్థాయి అధికారి లేదా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రతీ కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రతను పర్యవేక్షించనున్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా.. ఇప్పటికే పారామిలటరీ, కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీసులను భారీ ఎత్తున మోహరించారు.
కాగా, మే 12న 222 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 72.13శాతం ఓటింగ్ నమోదైన సంగతి తెలిసిందే.
ఇద్దరికీ సీఎం ఛాన్స్ లేనట్టేనా?:
ఎన్నికల ఫలితాల్లో 'హంగ్' ఏర్పడితే కాంగ్రెస్, బీజేపీలు రెండు జేడీఎస్ మద్దతు కోసం ప్రయత్నించే అవకాశముంది. కింగ్ మేకర్ పాత్రలో జేడీఎస్ ఎవరివైపు మొగ్గు చూపుతుందనేది కీలకం. ఒకవేళ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే మాత్రం సిద్దరామయ్యకు బదులుగా మరొకరిని సీఎం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సిద్దరామయ్య కూడా సుముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అదే జరిగితే.. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేకు సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి.
ఇక అటు బీజేపీ పరిస్థితి కూడా అంతే. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే.. యడ్యూరప్పకు బదులు అనంత్ కుమార్ ను సీఎం ఛాన్స్ అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications