కర్ణాటక రిజల్ట్స్: కీలక సెగ్మెంట్లు ఇవే, ఓటర్ల మొగ్గు ఎటువైపు
Recommended Video
బెంగుళూరు: దక్షిణాదిలోని కర్ణాటక రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసేదేవరో ఓటర్లు నిర్ణయించారు. అయితే ఈవీఎంలలో అభ్యర్ధుల భవితవ్యం భద్రంగా ఉంది. అయితే కర్ణాటక రాష్ట్రంలోని కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అభ్యర్దులను ఓటర్లు కరుణిస్తారా లేదా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. దక్షిణాదిలో పాగా వేసేందుకు బిజెపి, అధికారాన్ని నిలుపుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేసింది. అయితే ఓటర్లు ఎవరికీ మద్దతుగా నిలుస్తారనేది తేలనుంది.
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను బిజెపి, కాంగ్రెస్ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం ఈ రెండు పార్టీల అగ్రనేతలు తీవ్రంగా శ్రమించారు.
అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారంగా హంగ్ అసెంబ్లీ దిశగా కర్ణాటక ఫలితాలు ఉండే అవకాశం ఉందని తేలింది. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఓటర్లు నిజం చేస్తారా, లేదా అనేది తేలాల్సి ఉంది.
కర్ణాటకలో కీలక సెగ్మెంట్లు
కర్ణాటక రాష్ట్రంలోని కీలకమైన అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్లు ఎవరికి మద్దతుగా నిలుస్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్య చాముండేశ్వరీ, బాదామీ నుండి పోటీ చేశారు.మాజీ ముఖ్యమంత్రి జెడి(ఎస్) అధినేత కుమారస్వామి చెన్నపట్టణ, రామనగర స్థానాల నుండి బరిలో దిగారు. బిజెపి ఎంపీ శ్రీరాములు మొలకాల్మూరు, బాదామి నుండి బరిలో నిలిచారు. బిజెపి నేత , మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప శికారిపురలో బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గాల్లో ఓటర్లు ఏ రకమైన తీర్పును ఇస్తారోననే ఆసక్తి నెలకొంది.
ఓటర్ల కరుణ ఎవరికో
కర్ణాటక రాష్ట్ర హోం శాఖ మంత్రిగా ఉన్న రామలింగారెడ్డి బీటీఎం లేఅవుట్ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. అయితే రామలింగారెడ్డి పోటీ చేసిన స్థానంలోని ఓ పోలింగ్ కేంద్రంలో అవకతవకలు చోటు చేసుకొన్నాయని విపక్షాలు ఆరోపణలు చేశాయి. ఈ మేరకు ఎన్నికల సంఘానికి కూడ ఫిర్యాదు చేశాయి. కనకపుర నుండి శివకుమార్, బ్యాటరాయనపుర నుండి కృష్ణబైరేగౌడ, నరసింహరాజ నుండి తన్వీర్సేఠ్, హల్యాల నుండి ఆర్ వి దేశ్పాండే బబలేశ్వర్ నుండి ఎంబి పాటిల్, దారవాడ దక్షిణ నుండి వినయకులకర్ణి, సేడం నుండి శరణప్రకాష్ పాటిల్ బరిలో నిలిచారు. ఈ సెగ్మెంట్లలోని ఫలితాలపై రాజకీయ విశ్లేషకులు ఆసక్తిని చూపుతున్నారు.
విపక్ష నేతల సీట్లపై ఆసక్తి
ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో విపక్ష నేతలుగా ఉన్న ఈశ్వరప్ప శివమొగ్గ నుండి బరిలో నిలిచారు. జగదీశ్ శెట్టర్ హుబ్లీ ధార్వాడ కేంద్రం నుండి బరిలో నిలిచారు. ఈ రెండు స్థానాలపైఅందరి దృష్టి కేంద్రీకృతమైంది. మంత్రులుగా ఉన్న రమేష్కుమార్, ప్రియాంక ఖర్గే, యు.టి ఖాదర్, రమానాథరై, ఈశ్వరఖండ్రే నియోజకవర్గాల్లో పరిస్థితిపై కూడ సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదేవిధంగా మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డి బళ్ళారి నగర నుండి పోటీ చేస్తున్నారు. హరప్పనహళ్లి నుండి కరుణాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.వీరి అనుచరులు ఫకీరప్ప బళ్లారి గ్రామీణంనుండి బరిలో ఉన్నారు. కంప్లి నుండి సురేష్బాబు, బీటీఎంలేఅవుట్ లల్లేష్ రెడ్డి, హోస్పేట నుండి గవియప్ప హువినహడగలి నుండి చంద్రనాయక్ బరిలో నిలిచారు. అయితే గాలి జనార్ధన్ రెడ్డిపై ఉన్న కేసుల కారణంగా ఈ ఎన్నికల్లో ఆయనను ప్రచారానికి దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.ఈ ఆదేశాల మేరకు ఆయన ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమౌతాయా
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమౌతాయా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పోలింగ్ పూర్తైన వెంటనే విడుదల చేసిన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో హంగ్ అసెంబ్లీ తప్పదని తేలింది. అయితే ఈ విషయమై ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఖచ్చితమౌతాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో తమిళనాడు రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ జయలలిత నేతృత్వంలోని అన్నాడిఎంకె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.