మతమార్పిడి చేస్తున్నారంటూ ఓ కుటుంబంపై దాడి: మహిళకు గాయాలు, ఏడుగురిపై కేసు
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో స్థానిక హిందువులను మతమార్పిడికి పాల్పడుతున్నారనే నెపంతో ఓ కుటుంబంపై పలువురు దాడి చేశారు. ఈ ఘటన డిసెంబర్ 29న బెల్గాం జిల్లా ముదలగి ప్రాంతంలో జరిగింది.
పాస్టర్ అక్షయ్కుమార్ కరగన్వి తన నివాసంలో ప్రార్థనలు చేస్తుండగా, రైట్వింగ్ సభ్యులు అతని ఇంటిపై దాడి చేసి ప్రార్థన సెషన్ను ఆపాలని డిమాండ్ చేశారని ఆరోపించారు. తమ కుటుంబాన్ని అక్రమంగా మతం మార్చుకుంటున్నారని ఆరోపిస్తూ వారిపై దాడికి దిగారని చెప్పారు.
ప్రస్తుతం బెలగావిలోని ఓ ఆసుపత్రిలో కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న మహిళపై దుండగులు వేడి కూరను విసిరారని పాస్టర్ భార్య కవిత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన మరో మహిళపై కూడా దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటన తర్వాత శివానంద్ శివలింగప్ప, రమేష్ దండాపూర్, పరసప్ప బాబు, ఫకీరప్ప బాగేవాడి, కృష్ణ కాంతికర్, చతన్ రాజేంద్ర, మహంతేష్ బసలింగప్ప అనే ఏడుగురు నిందితులపై ఘటప్రభ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరంతా ముదలగి వాసులు.
నిందితులపై ఐపీసీలోని వివిధ సెక్షన్లు 143 (అల్లర్లు), 448 (అతిక్రమించడం), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 392 (దోపిడీ), 506 (నేరపూరిత బెదిరింపు), షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల(అట్రాసిటీల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేశారు.