కేసు నుంచి బయటపడిన యెడ్డీ, మంత్రి
బెంగళూరు: అక్రమ డినోటిఫికేషన్ కేసు నుంచి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బీ.ఎస్. యడ్యూరప్ప, కర్ణాటక మంత్రి డీ.కే. శివకుమార్ (కాంగ్రెస్) విముక్తి పొందారు. వీరిద్దరి మీద విచారణలో ఉన్న కేసును హై కోర్టు కొట్టివేసింది.
బెంగళూరు నగరంలోని పాత మద్రాసు రోడ్డులోని బెన్నిగానహళ్ళిలో అక్రమంగా డినోటిఫికేషన్ చేసి అధికార దుర్వినియోగం చేశారని అబ్రహాం అనే వ్యక్తి లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. లోకాయుక్త అధికారులు కేసు నమోదు చేశారు. లోకాయుక్త కోర్టులో కేసు విచారణలో ఉంది.
అయితే తమ మీద లోకాయుక్తలో అక్రమంగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారని, విచారణను నిలిపివేయాలని మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, డీ.కే. శివకుమార్ కర్ణాటక హై కోర్టును ఆశ్రయించారు.
డిసెంబర్ 2వ తేది విచారణ పూర్తి చేశారు. తీర్పును రిజర్వులో పెట్టారు. డిసెంబర్ 18వ తేది శుక్రవారం హై కోర్టు న్యాయమూర్తి ఆనంద బైరారెడ్డి యడ్యూరప్ప, డీ.కే. శివకుమార్ మీద నమోదు అయిన కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. హై కోర్టు తీర్పును తాను సుప్రీం కోర్టులో సవాలు చేస్తానని ఫిర్యాదుదారుడు అబ్రహాం అంటున్నారు.