ప్రధాని మోడీ కంటే నా తమ్ముడి మెజారిటీనే ఎక్కువ, త్రిబుల్ షూటర్ చాలెంజ్: బీజేపీ కసరత్తు!
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ 2019 లోక్ సభ ఎన్నికల మెజారిటీ కంటే బెంగళూరు గ్రామీణ లోక్ సభ నియోజక వర్గంలో తన తమ్ముడిని ఎక్కవ మెజారిటీతో గెలిపించుకుంటానని కర్ణాటక మంత్రి, త్రిబుల్ షూటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే. శివకుమార్ ఆయన సన్నిహితుల ముందు శపథం చేశారు.
మంత్రి డీకే. శివకుమార్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న బీజేపీ నాయకులు బెంగళూరు గ్రామీణ లోక్ సభ నియోజక వర్గం నుంచి బలమైన నాయకుడిని పోటీలో దింపాలని, లోక్ సభ సిట్టింగ్ ఎంపీ డీకే. సురేష్ కు, అతని సోదరుడు డీకే. శివకుమార్ కు తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించారు.
బెంగళూరు నగరంలోని మూడు లోక్ సభ నియోజక వర్గాల్లో బీజేపీ బలంగా ఉంది. అయితే బెంగళూరు గ్రామీణ నియోజక వర్గంలో కాంగ్రెస్ బలంగా ఉంది. మాజీ మంత్రి సీపీ. యోగేశ్వర్, రామనగర జిల్లా బీజేపీ అధ్యక్షుడు రుద్రేష్, తులసి మునిరాజులలో ఎవరినో ఒకరిని బెంగళూరు గ్రామీణ జిల్లా నుంచి పోటీ చేయించాలని బీజేపీ నాయకులు ఆలోచిస్తున్నారు.
చెన్నపట్టణ శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన సీపీ. యోగేశ్వర్ ను బెంగళూరు గ్రామీణ లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేయించాలని బీజేపీ నాయకులు చర్చలు జరిపారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప ఇంటిలో బీజేపీ నాయకులు సమావేశం అయ్యి ఇదే విషయంపై చర్చించారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్. అశోక్ బెంగళూరు గ్రామీణ లోక్ సభ నియోజక వర్గం నుంచి సీపీ. యోగేశ్వర్ తో పోటీ చేయించే విషయంపై చర్చించామని, త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కంటే ఎక్కువ మెజారిటీ తన తమ్ముడు డీకే. సురేష్ కు వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న మంత్రి డీకే. శివకుమార్ సరైన సమాదానం చెప్పాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు.