బెంగళూరులో విజయవాడ టెక్కీ మృతిపై డీకే శివకుమార్ సీరియస్
బెంగళూరు: బెంగళూరులో కురిసిన భారీ వర్షాలకు విజయవాడకు చెందిన టెక్కీ భానురేఖ మృతి చెందిన ఘటన పట్ల కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆసుపత్రిలో భానురేఖ మృతదేహాన్ని సందర్శించారు.. నివాళి అర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. వారిని ఓదార్చారు. అయిదు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించారు.
ఆదివారం బెంగళూరులో కురిసిన అతి భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. కుటుంబంతో కలిసి కారులో వెళ్తోండగా కేఆర్ సర్కిల్ వద్ద గల అండర్పాస్లో వరద నీటిలో చిక్కుకున్నారు. కుటుంబ సభ్యులు సకాలంలో బయటికి రాగలిగినప్పటికీ భానురేఖ కారులో చిక్కుకుపోయారు. ఊపిరి ఆడక మృతిచెందారు. ఆమె స్వగ్రామం కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో గల ఇన్ఫోసిస్ క్యాంపస్లో ఉద్యోగం చేస్తున్నారు.

ఈ విషాదకర ఘటనను కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని అండర్పాస్ల స్థితిగతులు, వాటి నిర్వహణపై సమగ్ర నివేదికను అందజేయాలంటూ మున్సిపాలిటీలు, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖలకు ఆదేశించింది. రెండు రోజుల్లోగా ఈ నివేదిక పంపించాలని సూచించింది. అధికారుల నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని తెలిపింది.
బెంగళూరులో మొత్తం 18 అండర్పాస్లు ఉన్నాయి. వాటి నిర్వహణ, డ్రైనేజీ, వర్షపు నీటి తరలింపు వ్యవస్థకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందజేయాలంటూ ఆయా శాఖల అధికారులను ఆదేశించినట్లు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. బెంగళూరులో ఉన్న 18తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని అండర్పాస్ల వివరాలను తెలియజేయాలని వారికి ఆదేశించామని అన్నారు.
కొన్ని అండర్పాస్లు రైల్వే శాఖ ఆధీనంలో ఉన్నాయని, అక్కడి నుంచి కూడా సమాచారాన్ని తెప్పించుకుంటామని డీకే శివకుమార్ చెప్పారు. భానులేఖ మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి సంతాపం తెలిపారు. ప్రభుత్వం అయిదు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించిందని గుర్తు చేశారు. మున్ముందు ఇలాంటి విషాదకర ఘటనలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటామని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications