శాండల్వుడ్ డ్రగ్స్ స్కాండల్: జైలు నుంచి ఇక ఆ నటి బయటికి: బెయిల్కు కర్ణాటక హైకోర్టు ఓకే
బెంగళూరు: కన్నడ చలన చిత్ర పరిశ్రమకు కొన్ని రోజుల పాటు కుదుపులకు గురి చేసిన డ్రగ్స్ స్కాండల్ కేసు.. మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టయిన ప్రముఖ కన్నడ నటి సంజన గల్రానికి బెయిల్ లభించింది. ఈ మేరకు కర్ణాటక హైకోర్టు కొద్దిసేపటి కిందట ఉత్తర్వులను జారీ చేసింది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ సంజన గల్రాని దాఖలు చేసిన పిటీషన్ను విచారించిన అనంతరం కర్ణాటక సింగిల్ జడ్జి బెంచ్.. బెయిల్ను మంజూరు చేసింది. ఆరోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకుని ఆమెకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చినట్లు బెంచ్ పేర్కొంది.
శాండల్వుడ్ డ్రగ్ స్కాండల్ కేసులో సంజన గల్రానితో పాటు సహ నటి రాగిణి ద్వివేది అరెస్టయిన విషయం తెలిసిందే. వారిద్దరూ బెంగళూరులోని పరప్పన అగ్రహారలో గల కేంద్ర కారాగారంలో ఉన్నారు. కొద్దిరోజులుగా సంజన గల్రాని అనారోగ్యానికి గురయ్యారు. ఆమెకు బ్యాక్ పెయిన్ ఇబ్బంది పెడుతున్నట్లు జైలు అధికారులు ధృవీకరించారు. జైలులోనే ఆమె చికిత్స తీసుకుంటున్నారు. అనారోగ్య కారణాలను చూపుతూ కిందటి నెల ఆమె బెయిల్ కోసం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా.. అది తిరస్కరణకు గురైంది.
తాజాగా మరోసారి ఆమె బెయిల్ పిటీషన్ను దాఖలు చేశారు. తాను చికిత్స పొందుతున్నందుకు సాక్ష్యాధారాలను న్యాయస్థానానికి సమర్పించారు. ఈ పిటీషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ హరీష్ కుమార్.. ఈ పిటీషన్పై విచారణ చేపట్టారు. సంజన తరఫున సీనియర్ అడ్వొకేట్ హస్మత్ పాషా తన వాదనలను వినిపించారు. ఇదివరకు ఆమె తీసుకున్న ట్రీట్మెంట్.. ఇతరత్రా వివరాలను ఆయన సమర్పించారు.
వాటిని పరిశీలించిన అనంతరం.. ఆరోగ్య కారణాల కింద బెయిల్ ఇస్తున్నట్లు న్యాయమూర్తి శ్రీనివాస్ హరీష్ కుమార్ తెలిపారు. మూడు లక్షల రూపాయల పూచీకత్తు, ఇద్దరు వ్యక్తుల ష్యూరిటీ ఇవ్వాలని ఆదేశించారు. నెలలో రెండుసార్లు పోలీస్ స్టేషన్ లేదా న్యాయస్థానంలో సంతకం చేయాల్సి ఉంటుందని సూచించారు. పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరు కావాల్సి ఉంటుందని, సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడం, సాక్ష్యులను బెదిరించడం వంటి చర్యలకు పాల్పడకూడదని న్యాయమూర్తి షరతులు విధించారు.