గాలిజనార్దన్ రెడ్డి, శ్రీరాములు శిష్యుడు కాంగ్రెస్ లోకి: ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ క్లారిటీ!
బెంగళూరు: మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీమంత్రి గాలిజనార్దన్ రెడ్డి, బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములు ప్రధాన అనుచరుడు, మాజీ మంత్రి, హోస్ పేట్ బీజేపీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకుంటారు అంటూ ఇంతకాలం జరిగిన ప్రచారానికి తెరపడింది. స్వయంగా ఆనంద్ సింగ్ శుక్రవారం మీడియాతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే విషయంపై క్లారిటీ ఇచ్చారు.

కాంగ్రెస్ లిస్టులో పేరు
కర్ణాటకలో త్వరలో జరుగుతున్న శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాలో తన పేరు ఉన్నట్లు ప్రచారం జరుగుతోందని, ఆయితే ఆ విషయం ఇంకా తన వరకు రాలేదని బీజేపీ ఎమ్మెల్యే ఆనంద్ మీడియాకు చెప్పారు.

మంత్రి కారులో వెళ్లాను
బళ్లారి జిల్లా ఇన్ చార్జ్ మంత్రి సంతోష్ లాడ్ కారులో తాను ప్రయాణించింది, ప్రజలకు కనపడింది నిజమే అని ఆనంద్ సింగ్ అన్నారు. తన హోస్ పేట నియోజక వర్గం అభివృద్ది పనులు, ప్రజల సమస్యలు గురించి మంత్రి సంతోష్ లాడ్ తో చర్చించానని ఆనంద్ సింగ్ అన్నారు.

సీఎం, మంత్రితో భేటీ !
ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మంత్రి సంతోష్ లాడ్ తో తాను కలిసి మాట్లాడింది నిజమే అని ఆనంద్ సింగ్ వివరణ ఇచ్చారు. తన నియోజక వర్గం అభివృద్ది పనుల గురించిన మాట్లాడుతున్న సమయంలో తీసిన ఫోటోలు మీడియాలో వచ్చాయని అన్నారు. అయితే ఆ ఫోటోలు హంపి ఉత్సవాల్లో తీశారని, చాల పాత ఫోటోలు అని ఆనంద్ సింగ్ వివరణ ఇచ్చారు.

బీజేపీలో సమస్యలు
బళ్లారి జిల్లాలోని బీజేపీ నాయకత్వంలో సమస్యలు ఉన్నాయని స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ అంగీకరించారు. అయితే జాతీయ, రాష్ట్ర నాయకత్వంలో ఎలాంటి సమస్యలు లేవని, సమర్థవంతమైన నాయకులు ఉన్నాయని ఆనంద్ సింగ్ వివరించారు.

కాంగ్రెస్ పార్టీలోకి !
తన నియోజక వర్గం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఇన్ని రోజులు బెంగళూరులో ఉన్నానని, బీజేపీ పరివర్తనా ర్యాలీలో పాల్గొనకపోవడానికి ఓ కారణం ఉందని ఆనంద్ సింగ్ అన్నారు. అయితే తాను బీజేపీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం లేదని, ఇప్పటికే మాజీ మంత్రి సీటీ. రవి, బళ్లారి బీజేపీ శాఖ అధ్యక్షుడు చెన్నబసవేగౌడ, నాయకులు రామలింగప్ప, తిమ్మారెడ్డి తదితరులు తనతో మాట్లాడారని ఆనంద్ సింగ్ చెప్పారు. మొత్తం మీద పార్టీ మారనని ఆనంద్ సింగ్ స్వయంగా వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications